మంజీరా బ్యారేజీకి ముప్పులేదు.. పిల్లర్లకు ప‌గుళ్లు వ‌చ్చాయ‌న్న వార్తలు ఫేక్

మంజీరా బ్యారేజీకి ముప్పులేదు.. పిల్లర్లకు ప‌గుళ్లు వ‌చ్చాయ‌న్న వార్తలు ఫేక్
  • ఆధునికీకరణ కోసం రూ.600 కోట్లతో డీపీఆర్
  •  ఇప్పటికే రూ. 3.52 కోట్లతో మరమ్మతులు చేస్తున్నం
  • బ్యారేజీని సందర్శించిన వాటర్​బోర్డు ఎండీ అశోక్ రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి తాగునీరు అందించే మంజీరా బ్యారేజీకి ఎలాంటి ముప్పులేద‌ని వాటర్​బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల‌తో కలిసి శ‌నివారం ఆయన మంజీరా బ్యారేజీ, బారాజ్ గేట్లు, పిల్లర్లు, పంప్​హౌజ్‌ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. బారాజ్‌ పిల్లర్లకు ప‌గుళ్లు వ‌చ్చాయ‌న్న వార్తలు అవాస్తవ‌మ‌న్నారు. బ్యారేజీకి సంబంధించిన గేట్లు, రోప్​ల ప‌నితీరు కూడా సంతృప్తిగానే ఉన్నట్లు చెప్పారు.

అయితే బారాజ్ దిగువ‌న ఆఫ్రాన్ కొంత‌మేర‌కు దెబ్బతిన్నద‌ని వెంట‌నే మ‌రమ్మత్తుల‌ కోసం ఏజెన్సీతో మాట్లాడి యుద్ధప్రాతిప‌దిక‌న ప‌నులు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అలాగే రెండో గేటు లీకేజీను అరిక‌ట్టడానికి మ‌ర‌మ్మత్తు ప‌నుల‌ను చేప‌ట్టాల‌ని కూడా అధికారులకు సూచించారు.

 బ్యారేజీపై గేట్లు, రోల‌ర్, ప్యాన‌ల్ బోర్డులు, ఎలక్ట్రో మెకానిక‌ల్ త‌దిత‌ర భాగాల‌ను ప‌రిశీలించిన ఎండీ.. ఎప్పటిక‌ప్పుడు గ్రీజు, క‌ల‌రింగ్, లైటింగ్ త‌దిత‌ర ఏర్పాట్లను చేసుకోవాల‌ని అధికారుల‌కు సూచించారు. స్పిల్​వే ఇరుపక్కల్లో ఫెన్సింగ్ ఏర్పాటుచేసి మాన‌వ సంచారం నిరోధించాల‌ని తెలిపారు. అలాగే ఆన‌క‌ట్టపై మొలిచిన చెట్లు, కంప‌చెట్ల తొలగింపు వారంలోప‌ల పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

అందుకే కొత్తగేట్ల అమ‌రిక వాయిదా

బ్యారేజీపై గేట్లను మార్చడానికి దాదాపు 45 రోజులు ప‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నట్టు, అలాగే జ‌లాశయంలోని మొత్తం నీటిని దిగువ‌కు వ‌ద‌లవ‌ల‌సిన ప‌రిస్థితి ఏర్పడుతుంద‌ని చెప్పారు. అన్నిరోజులు హైద‌రాబాద్ న‌గ‌రానికి 40 ఎంజీడీల నీటి కొర‌త ఏర్పడుతుంద‌ని వివ‌రించారు. న‌గ‌ర‌వాసుల‌కు తాగునీటి ఇక్కట్లు రాకుండా ఉండేందుకే కొత్తగేట్ల అమ‌రిక వాయిదా వేస్తున్నట్లు ఈ సంద‌ర్భంగా ఎండీ పేర్కొన్నారు. గ‌తంలో 2019 ఫిబ్రవ‌రి నుంచి అక్టోబ‌ర్ 2020 వ‌ర‌కు బారాజ్​లో నీటిని వినియోగించలేద‌ని, ఆ స‌మ‌యంలో ‌ గేట్ల రిపేర్ ప‌నులు చేప‌ట్టి ఉంటే నీటిసరఫరాలో అంతరాయం లేకుండా ఉండేదన్నారు.

భ‌విష్యత్తు అవ‌స‌రాల‌ కోసం మంజీరా డ్రింకింగ్ వాట‌ర్ ప్రాజెక్టును ఆధునికీక‌ర‌ణ ప‌నుల‌ కోసం రూ. 600 కోట్లతో డీపీఆర్‌ను రూపొందించి ప్రభుత్వానికి సమ‌ర్పించామని,  సీఎం రేవంత్‌రెడ్డి ఆధునికీక‌ర‌ణ ప‌నుల‌తోపాటు ఇప్పుడున్న మంజీరా ఫేస్ 1,2 మంచినీరు సర‌ఫ‌రా పైపులైనుల‌తోపాటు మ‌రో కొత్త పైపులైనును నిర్మించాల‌ని సూచించారన్నారు. దాంతోపాటు వాట‌ర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణం ఈ ప్రాజెక్టు ప‌నుల‌లో బాగంగా చేప‌ట్టనున్నట్టు అశోక్​రెడ్డి వెల్లడించారు. ఆయన వెంట డైరెక్టర్ టెక్నిక‌ల్ సుద‌ర్శన్‌, సీజీఎం బ్రిజేశ్, ట్రాన్స్‌మిష‌న్ అధికారులు ఉన్నారు.

65 ఏండ్ల నాటి నిర్మాణం 

మంజీరా బ్యారేజీని 65 ఏండ్ల క్రితం నిర్మించారని, అప్పుడు బిగించిన‌ గేట్లకు ఏటా నిర్వహ‌ణ‌ ప‌నులు చేప‌డుతున్నామన్నారు. గేట్లు, రోప్‌లు, బేరింగ్​లను మార్చాల‌ని అధికారులు అంచ‌నా వేశార‌న్నారు. దానిక‌నుగుణంగా గ‌తేడాది మేలో రూ.3.52 కోట్లతో ప్రతిపాద‌న‌ల‌ను పూర్తిచేసి, టెండ‌ర్ ప్రక్రియ పూర్తిచేసి ఏజెన్సీని నియ‌మించామ‌ని వివ‌రించారు. బ్యారేజీ గేట్ల బిగింపు కాకుండా మిగ‌తా ప‌నులు పురోగ‌తిలో ఉన్నట్టు తెలిపారు.