ట్రిపుల్ ఆర్​ వరకూ వాటర్​బోర్డు.. సిద్ధమవుతున్న యాక్షన్​ ప్లాన్

ట్రిపుల్ ఆర్​ వరకూ వాటర్​బోర్డు.. సిద్ధమవుతున్న యాక్షన్​ ప్లాన్

హైదరాబాద్​సిటీ, వెలుగు:జంట నగరాల తాగునీటి అవసరాలు తీరుస్తున్న మెట్రోవాటర్​బోర్డు ఇక నుంచి తన పరిధిని మరింత విస్తరించుకునేందుకు సిద్ధమవుతోంది. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో ట్రిపుల్​ఆర్ వరకూ వాటర్​బోర్డు విస్తరించనుంది. ఇందుకోసం అధికారులు యాక్షన్​ప్లాన్​ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాలతోపాటు ఔటర్ రింగ్ రోడ్​లోని మరికొన్ని గ్రామాలకు రోజుకు 550 ఎంజీడీ నీటిని వాటర్ బోర్టు సరఫరా చేస్తున్నది.

 త్వరలో గోదావరి రెండు, మూడో దశ పనులు పూర్తయితే మరింత నీటి లభ్యత ఏర్పడనుంది. రోజుకు 160 ఎంజీడీల నీరు అదనంగా అందించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ట్రిపుల్​ఆర్​వరకూ ఉన్న గ్రామాల వరకూ తాగునీటిని సరఫరా చేసేలా వాటర్​బోర్డు పరిధిని విస్తరించనున్నారు. ఇప్పటికే ట్రిపుల్ ఆర్​వరకూ ఉన్న ప్రాంతాలను అర్బన్​కోర్​ఏరియాగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండడంతో రియల్​ఎస్టేట్ కూడా​పుంజుకుంటోంది. 

ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు కూడా పెరుగుతున్నాయి. వాటర్​బోర్డు పరిధి పెరగడం వల్ల ఆయా ప్రాంతాల్లో నిర్మాణాలు చేసుకునే వారికి అవసరమైనతం నీటిని కూడా అందించనున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వాటర్​బోర్డు పరిధి 1450 చ. కి.మీ. కాగా, కొత్తగా ట్రిపుల్​ఆర్​వరకూ విస్తరిస్తే మరో 2500 చ.కి.మీ. వరకూ పెరిగే అవకాశం ఉంటుందని వివరించారు. దీంతో ప్రస్తుతం ఆయా ప్రాంతాలు బోర్డు పరిధిలోకి వస్తే రోజుకు 750 ఎంజీడీల నీటిని సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు.