పార్లమెంట్ బిల్డింగ్​లో వాటర్​ లీకేజీ .. గ్లాస్ డోమ్ నుంచి లాబీలోకి నీళ్లు

పార్లమెంట్ బిల్డింగ్​లో వాటర్​ లీకేజీ .. గ్లాస్ డోమ్ నుంచి లాబీలోకి నీళ్లు

న్యూఢిల్లీ: పార్లమెంట్ కొత్త బిల్డింగ్ లాబీలో పైకప్పు నుంచి వాటర్ లీకేజీ అయింది. బుధవారం ఢిల్లీలో భారీ వర్షం పడిన నేపథ్యంలో పార్లమెంట్ బిల్డింగ్ గ్లాస్ డోమ్ నుంచి లాబీలోకి నీళ్లు కారాయి. దీంతో ఆ నీళ్లు ఫ్లోర్ అంతా వ్యాపించకుండా ఉండేలా సిబ్బంది బకెట్ పెట్టారు. గురువారం ఉదయం ఈ దృశ్యాన్ని గమనించిన ఎస్పీ చీఫ్, ఎంపీ అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వీడియోలు తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయగా వైరల్ అయ్యాయి. ‘బయట పేపర్ లీకేజీ.. లోపల వాటర్ లీకేజీ’ అని క్యాప్షన్ పెడుతూ మాణిక్కం ఠాగూర్ ఈ వీడియోను షేర్ చేశారు.

ఈ విషయాన్ని సభలో సైతం ప్రస్తావించిన ఆయన.. వెంటనే వాటర్ లీకేజీలను అరికట్టాలని కోరారు. దీనిపై చర్చకు సభలో వాయిదా తీర్మానాన్ని సైతం ఆయన ప్రవేశపెట్టారు. ఇక అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. వందల కోట్లు పెట్టి కట్టిన కొత్త బిల్డింగ్ లో ‘వాటర్ డ్రిప్పింగ్ ప్రోగ్రాం’ నడుస్తోందని, సమావేశాలను పాత బిల్డింగ్ కు మార్చాలని కామెంట్ చేశారు. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ప్రధాని మోదీ ఇగోకు ప్రతిరూపమని, ఎన్నికల్లో మోదీ దెబ్బతిన్నదానికి సంకేతంగా ఈ బిల్డింగ్ లో వాటర్ లీకేజీ అవుతోందంటూ మహువా ట్వీట్ చేశారు. అయితే, పార్లమెంట్ పాత బిల్డింగ్ లోనూ 2010లో జీరో అవర్ సాగుతుండగా వాన నీళ్లు వచ్చాయని, అప్పుడు వీరంతా దానిని కట్టిన బ్రిటిష్ వాళ్లపై ఎందుకు సెటైర్లు వేయలేదంటూ బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ప్రశ్నించారు. బ్రిటిష్ వాళ్లను ఇష్టపడే వీళ్లు.. అప్పట్లో నీటితో నిండిన పార్లమెంట్ లాబీలు అందంగా ఉన్నాయని అన్నారని విమర్శించారు. 

సమస్యను పరిష్కరించాం

లోక్ సభ సెక్రటేరియెట్ పార్లమెంట్ బిల్డింగ్ లో లీకేజీ సమస్యను గుర్తించి, పరిష్కరించామని లోక్ సభ సెక్రటేరియెట్ తెలిపింది. ‘‘బుధవారం భారీ వర్షాలు కురిశాయి. భవనం లాబీపై గ్లాస్ డోమ్ లను ఫిక్స్ చేయడానికి ఉపయోగించిన జిగురు కొద్దిగా బయటకు రావడంతో నీళ్లు లీక్ అయ్యాయి. సమస్యను గుర్తించి, దానిని ఫిక్స్ చేశాం. బిల్డింగ్ లో మరెక్కడా లీకేజీలు లేవు” అని వివరించింది.