మూసీ పేరుతో విధ్వంసం..ప్రక్షాళన పేరిట రేవంత్ పేదల ఇండ్లు కూలుస్తున్నడు : హరీశ్

మూసీ పేరుతో విధ్వంసం..ప్రక్షాళన పేరిట రేవంత్ పేదల ఇండ్లు కూలుస్తున్నడు : హరీశ్
  • మూసీ ప్రక్షాళనకు మేం వ్యతిరేకం కాదు.. లూటిఫికేషన్​కే మేం వ్యతిరేకం
  • మూసీ కోసం మాత్రం రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరదీసిండని ఆరోపణలు

హైదరాబాద్, వెలుగు: మూసీ పునరుజ్జీవానికి బీఆర్ఎస్​ వ్యతిరేకం కాదని.. కానీ, మూసీ పేరిట రేవంత్​ చేస్తున్న లూటిఫికేషన్​కే వ్యతిరేకమని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్​ రావు అన్నారు. మూసీ సుందరీకరణ పేరిట వేలాది మందిని నిరాశ్రయులుగా మారుస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. అసలు మూసీ బ్యూటిఫికేషన్​కు శ్రీకారం చుట్టింది కేసీఆర్​ అని, రూ.4 వేల కోట్లతో 32 ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని గుర్తుచేశారు.

కానీ, రేవంత్​ తుగ్లక్​ పాలన చేస్తున్నారన్నారు. ‘‘మూసీ శుద్ధీకరణను పూటకో పేరు మార్చుతూ, రోజుకో చోట ప్రజల ఇండ్లు కూల్చే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? మూసీ అభివృద్ధి పేరు చెప్పి హైదరాబాద్​లో ఎందుకు ఈ విధ్వంసఖాండను కొనసాగిస్తున్నావు. ఒక దిక్కు ఖజానా ఖాళీ అంటూనే.. ఏకంగాలక్షా 50 వేల కోట్లకు రేవంత్​ రెడ్డి టెండర్ పెట్టిండు’’ అని హరీశ్ ఫైర్ ​అయ్యారు. 

ముందు మూసీ బస్తీల్లో తిరుగు..

మూసీని బాగు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే.. ముందు రేవంత్​ రెడ్డి మూసీ బస్తీల్లో తిరిగి అక్కడి ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోవాలని హరీశ్​ రావు సూచించారు. 3,279.19 ఎకరాల్లో ఉన్న 10,017 నిర్మాణాలను కూల్చేందుకు సీఎం రేవంత్​ గెజిట్​ ఇచ్చారని, లక్షలాది మంది జీవితాలను కూల్చుతామంటున్నారని మండిపడ్డారు.

గల్ఫ్​ దేశాల్లో బాంబులేస్తూ ఇండ్లను కూల్చేస్తుంటే.. ఇక్కడ ఏ యుద్ధం లేకపోయినా రేవంత్​ రెడ్డి బుల్డోజర్లతో విధ్వంసం సృష్టిస్తున్నారన్నారని ఫైర్​ అయ్యారు. కాగా, మూసీ ప్రక్షాళనపై బీజేపీ స్టాండ్​ ఏంటో చెప్పాలని హరీశ్​రావు​డిమాండ్ చేశారు. శంకుస్థాపనకు కేంద్ర మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ వస్తారని సీఎం అంటున్నారని, మూసీ పేరిట రేవంత్​ చేస్తున్న రియల్​ ఎస్టేట్​ దందాకు, దోపిడీకి బీజేపీ సహకరిస్తున్నదా చెప్పాలన్నారు.

మూసీ ప్రక్షాళనకు రూ.4,100 కోట్లు ఇచ్చేందుకు ఏషియన్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​ ఒప్పుకుని మంజూరు చేసిందంటూ గత జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చెప్పారని.. కానీ, డీపీఆర్​ సమర్పించకపోవడంతో లోన్​ శాంక్షన్​ చేయలేదని నిరుడు డిసెంబర్​ 15, ఈ ఏడాది జనవరి 23, మార్చి 11న లేఖల్లో ఏడీబీ తెలిపిందని గుర్తుచేశారు. కానీ, అసెంబ్లీ వేదికగా రేవంత్​ పచ్చి అబద్ధం చెప్పారని, దీనిపై అసెంబ్లీలో ప్రివిలేజ్​మోషన్​ ఇస్తామని స్పష్టం చేశారు.

ఫిరాయింపులపై రాహుల్ స్టాండ్​ ఏంటో చెప్పాలి..

రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ రాహుల్​ గాంధీ ఇటు పార్లమెంట్​లో అటు బహిరంగ సభల్లో చెప్పారని, 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ఫిరాయింపుల చట్టాన్ని పటిష్టం చేస్తామని చెప్పారని, కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్​ పాలన అందుకు విరుద్ధంగా సాగుతున్నదని హరీశ్​ రావు విమర్శించారు.

బీఆర్​ఎస్​లో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్​.. కాంగ్రెస్​ బీఫాంపై ఓపెన్​గా లోక్​సభ ఎన్నికల్లో పోటీ చేశారని గుర్తుచేశారు. కానీ, స్పీకర్​ మాత్రం ఫిరాయింపులకు ఆధారాలు లేవంటూ తీర్పునిచ్చారన్నారు. రాహుల్​ చెప్పే రాజ్యాంగ పరిరక్షణ ఇదేనా? అని నిలదీశారు. తెలంగాణలో రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంటే.. ఢిల్లీలో మాత్రం మీరు దానిని రక్షిస్తున్నామని చెప్పుకునే అర్హత లేదన్నారు.