మేం ఏం చేశామో అదే చెబుతున్నాం.. మీరు కూడా అలాగే చెప్పుకోండి

మేం ఏం చేశామో అదే చెబుతున్నాం.. మీరు కూడా అలాగే చెప్పుకోండి
  • మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

నల్గొండ: మేము ఏమి చేశామో ప్రజలకు అదే చెబుతున్నాం.. కాంగ్రెస్ నేతలు కూడా వారు చేసింది చెప్పుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగార్జునసాగర్ లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు బరి తెగించి నోటికి వచ్చినట్లు మాట్లాడడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల కమిషన్, పోలీసులు కూడా దీనిపై స్పందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ కోరారు. రేపు ముఖ్యమంత్రి సభకు పెద్ద ఎత్తున తరలిరావడానికి సాగర్ ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఎన్నికల తర్వాత పోడుభూముల సమస్యను ముఖ్యమంత్రి తీరుస్తారని ఆయన పేర్కొన్నారు. భారతదేశంలో చెప్పిన ప్రతి పని పూర్తి చేసే ఏకైక నాయకుడు కేసీఆర్ అని, బీసీలు, మైనార్టీలు ఐక్యంగా ఉంటూ బీసీలకి కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 
జానారెడ్డి గెలిస్తే ఆరు ఏడవుతుంది గాని అభివృద్ధి జరగదు
కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న జానారెడ్డి గెలిస్తే ఆరు ఏడవుతుంది గాని.. నియోజకవర్గ అభివృద్ధి మాత్రం జరగదని మంత్రి తలసాని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎన్నడూ అందుబాటులో ఉండని జానారెడ్డి టిఆర్ఎస్ ను విమర్శించడం హస్యాస్పదంగా ఉందన్నారు. టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మాత్రమే సాగర్ అభివృద్ధి జరుగుతుంది, ప్రజలు ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం పని చేస్తున్న పార్టీ టిఆర్ఎస్ అని, కేసీఆర్ పాలనలోనే రైతులకు 24 గంటల విద్యుత్, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ద్వారా కుల వృత్తులను ఆదరిస్తున్న ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వమేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.