
కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నదని.. విద్యుత్ను ప్రైవేటుపరం చేస్తున్నదని బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తే తాము కూడా తగిన సమాధానం చెప్తామని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్ కే సింగ్ హెచ్చరించారు. రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నా చాలా విషయాల్లో అబద్ధాలు ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు. పవర్ ప్రాజెక్టులకు లోన్లు ఇస్తున్నా.. లోన్లు ఇవ్వడం లేదని అబద్ధాలను ప్రచారం చేస్తే నిజంగానే లోన్లు ఆపేస్తామని స్పష్టం చేశారు.
గురువారమిక్కడ కేంద్ర మంత్రి కిషన్రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారు అనేది పూర్తిగా అబద్ధమని.. తాను ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రకటన చేయలేదన్నారు. రైతులను మినహాయించి ప్రతిచోట మీటర్లు ఉండాలని మాత్రమే తాము చెప్పామని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి విద్యుత్తును ప్రైవేటు పరం చేసే ఆలోచన లేదన్నారు. మరోవైపు ఏపీ, తెలంగాణ మధ్యనున్న విద్యుత్తు బకాయిల అంశం కోర్టు పరిధిలో ఉందన్నారు.
భారీగా రుణాలు ఇచ్చాం
తెలంగాణకు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష 57 వేల కోట్లు మంజూరు చేసామని, రూ.19,700 కోట్లు మినహా మిగతా మొత్తాన్ని ఇప్పటికే రాష్ట్రానికి ఇచ్చామని వివరించారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.1లక్షా 8వేల కోట్ల రుణాలు మంజూరు చేశామని, ఇందులో ఇప్పటికే రూ.91 వేల కోట్లు విడుదల చేశామని వెల్లడించారు.ఎన్టీపీసీ తలపెట్టిన థర్మల్ పవర్ ప్లాంట్లను కట్టితీరుతామని ఆర్కే సింగ్ స్పష్టం చేశారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లో రెండు యూనిట్లను పూర్తి చేశామని.. నవంబరు, డిసెంబరు నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు.
రైతుల్ని తప్పుదారి పట్టిస్తున్నరు: కిషన్రెడ్డి
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలా? లేదా? అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం అని.. దీనికి కేంద్రంతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంపై సీఎం కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.