
హైదరాబాద్, వెలుగు: గత ప్రభుత్వం ఆర్ అండ్ బీలో హౌసింగ్ను విలీనం చేసిందని, ఆ ఉత్తర్వులను రద్దు చేసి హౌసింగ్ను సపరేట్ శాఖగా మారుస్తామని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో భాగంగా ఇండ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇండ్లు ఇస్తామని, గ్రామసభల ద్వారా అర్హులను ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్ లో హౌసింగ్ కార్పొరేషన్ అసిస్టెంట్ ఇంజినీర్లు, వర్క్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ 2024 డైరీ, క్యాలెండర్ను మంత్రి ఆవిష్కరించి, మాట్లాడారు. గత పాలకులు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామని ప్రజలను మోసం చేశారని ఆయన మండిపడ్డారు.
బిడ్డ, అల్లుడు వస్తే ఒక్క గదిలో ఎట్లుంటరు? అని పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పి ఇండ్లు మాత్రం ఇవ్వలేదన్నారు. ప్రజాపాలనలో ఇండ్ల కోసమే లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వాటిని అప్ లోడ్ చేశామని, త్వరలో గైడ్ లైన్స్ ఖరారు చేస్తామని తెలిపారు. గత పదేండ్లలో హౌసింగ్ ఉద్యోగులు, అధికారులకు జరిగిన నష్టాన్ని సెట్ చేస్తామని, వారికి న్యాయం చేస్తామన్నారు. కాగా, ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ అమలు కోసం డిపార్ట్ మెంట్ ను సపరేట్ చేయాలని అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి కోరారు. ఇతర శాఖల్లో డిప్యూటేషన్ మీద పనిచేస్తున్న ఉద్యోగులను మాతృ శాఖకు తీసుకొచ్చేందుకు మంత్రి చొరవ చూపాలన్నారు.
జూనియర్ ఎన్టీఆర్, షర్మిలను కలిసిన పొంగులేటి
మంత్రి పొంగులేటి దంపతులు, అతని సోదరుడు ప్రసాద్ రెడ్డి శనివారం జూనియర్ ఎన్టీఆర్, షర్మిలను కలిశారు. తన తమ్ముడు ప్రసాద్ రెడ్డి కుమారుడి పెండ్లికి రావాలని వారికి మంత్రి ఇన్విటేషన్ అందజేశారు.
రెవెన్యూ వ్యవస్థను బాగు చేస్తున్నం
రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత పదేండ్లలో రెవెన్యూ శాఖ, యంత్రాగం, వ్యవస్థ దుర్వినియోగం అయిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిచేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పటిష్టమైన విధానాన్ని రూపొందిస్తున్నదని తెలిపారు. శనివారం సెక్రటేరియెట్లో మంత్రి పొంగులేటితో కేరళ రెవెన్యూ మంత్రి కె.రాజన్ భేటీ అయ్యారు. కేరళలో అమలవుతున్న హౌసింగ్ స్కీమ్తో పాటు రెవెన్యూ విభాగం పనితీరు, వాటి వివరాలను పొంగులేటి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణతో పాటు సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను గుర్తించడంలో రెవెన్యూ పాత్ర కీలకమైందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు రెవెన్యూ శాఖ వారధిగా ఉంటుందని పేర్కొన్నారు.