
ముషీరాబాద్, వెలుగు: పదేళ్లుగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల స్కూళ్లలో అసిస్టెంట్ కేర్ టేకర్లుగా పనిచేస్తున్న వారిని అకారణంగా తొలగించడం సరికాదని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మెంబర్ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
బుధవారం ఇందిరా పార్క్ వద్ద అసిస్టెంట్ కేర్ టేకర్ల జేఏసీ ఆధ్వర్యంలో అధ్యక్ష, కార్యదర్శులు జయేందర్, కరుణాకర్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. కృష్ణయ్య మద్దతు తెలిపి మాట్లాడారు. పదేళ్లుగా పనిచేస్తున్న 263 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు. వెంటనే విధుల్లోకి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ.. నోటీసులు ఇవ్వకుండానే విధుల్లోంచి తొలగించడం ఏంటని ప్రశ్నించారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, జేఏసీ నాయకులు నర్సింగరావు, నిరూప, రాజు, నలిమేటి రాజు, మల్లేశ్, అనీయ, మమత, ఉషారాణి, రఘు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.