
కరీంనగర్ జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్ కు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మార్గ మధ్యలో ప్రజ్ఞాపూర్ లో బీజేపీ నాయకులతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలో మాట్లాడిన సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండి పడ్డారు.
ఉద్యోగాలు ఇచ్చే తెలివిలేని నాయకులు పేపర్ లీకేజీలు జరిపించి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్న తనను పేపర్ లీకేజీ నిందితుడు అంటూ అక్రమ కేసులు పెట్టి జైల్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు.
విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, త్వరలోనే నిరుద్యోగ మార్చ్ చేపట్టనున్నట్లు బండి సంజయ్ వెల్లడించారు. పేపర్ లీక్ వ్యవహారంలో నిర్లక్షంగా ఉన్న కేటీఆర్ ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
గ్లామర్ దెబ్బతింటుందని ఫామ్ హౌజ్ నుంచి బయటికి రాని ముఖ్యమంత్రి.. వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.