
వికారాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవని ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్ లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. జనాభా ప్రాతిపదికన, వాటాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాలని సూచించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యలను పరిష్కరించాలన్నారు.
జూలై నుంచి ప్రతీ నెల చివరి శనివారం పౌర హక్కుల దినాన్ని నిర్వహించి తహసీల్దార్, పోలీస్ అధికారి హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ కు సూచించారు. సీఎం జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పక్కదోవ పట్టకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. అంతకుముందు ఆయన కొత్తగడి రెసిడెన్షియల్ బాలికల స్కూల్ను సందర్శించారు. సమీక్షలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, ఎం.సుధీర్, డీవీఎంసీ సభ్యులు పెండ్యాల అనంతయ్య, గోవింద్ నాయక్, దస్తప్ప, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.