ఆదిలాబాద్ జిల్లా: కరోనాపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో వదూవరులు వినూత్నంగా ఆలోచించారు. అదిలాబాద్ జిల్లా, బోథ్ మండల కేంద్రంలో వదూవరులు పూల దండలతోపాటు మాస్కులతో తయారు చేయించిన దండలు మార్చుకున్నారు. శనివారం సాయి శృజన్, రవికాంత్ లకు స్థానికంగా పెళ్లి జరిగింది. లాక్ డౌన్ క్రమంలొ అతి తక్కువమంది సమక్షంలోనే పెళ్లి చేసుకున్నారు. ప్రభుత్వం విధించిన కోవిడ్ నిబంధనలు, మాస్కు ప్రాధాన్యత అందరికీ తెలియాలనే మాస్కులతో తయారు చేసిన దండలు వేసుకున్నట్లు కొత్త దంపతులు తెలిపారు.
పెళ్లికి వచ్చినవారందరికీ మాస్కులు తప్పనిసరిగా ఉండేలా ముందే జాగ్రత్త పడ్డామన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అతి తక్కువ మందినే ఆహ్వానించామని చెప్పుకొచ్చారు ఈ నూతన దంపతులు. ప్రస్తుతం ఈ మాస్కుల దండల ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.