హైదరాబాద్, వెలుగు: జంట నగరాల్లో పావురాలకు ఇష్టమొచ్చినట్లు ఆహారం వేయడం వల్ల పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్య సమస్యలు వస్తున్నాయని, వాటి నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. ముషీరాబాద్కు చెందిన డాక్టర్ రాధేశ్యామ్ దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్ల ధర్మాసనం విచారణ చేపట్టింది.
పావురాల వల్ల చారిత్రక కట్టడాలు, ఆస్పత్రులు అపరిశుభ్రంగా మారుతున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. ఆహారం వేయకుండా మార్గదర్శకాలు తెచ్చి, జరిమానాలు విధించాలని కోరారు. వాదనలు విన్న హైకోర్టు.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.
