V6 News

ఏ రైలు.. ఏ రైలును ఢీ కొట్టింది.. ఆ 20 నిమిషాలు ఏం జరిగింది?.. ఎందుకీ గందరగోళం

ఏ రైలు.. ఏ రైలును ఢీ కొట్టింది.. ఆ 20 నిమిషాలు ఏం జరిగింది?.. ఎందుకీ గందరగోళం

కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం వెనక కారణాలు ఏంటీ.. మొదటి ప్రమాదం ఎలా జరిగింది.. మొదట ఏ రైలును.. ఏ రైలు ఢీకొట్టింది.. ఆ 20 నిమిషాలు ఏం జరిగింది.. ఎందుకీ గందరగోళం అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత రైళ్లు ఢీకొన్నాయనే వార్తలు వస్తున్నాయి కానీ.. మొదటి ప్రమాదం ఎలా జరిగింది.. మూడు రైళ్లు ఢీకొనటం మధ్య సమయం ఉన్నా.. ఎందుకు రైల్వే అధికారులకు సమాచారం లేదు అనేది అంతుచిక్కని ప్రశ్నలుగా ఉన్నాయి.. ప్రాథమిక సమాచారం.. రైల్వే బాధితులు,  రైల్వే సిబ్బంది, అధికారులు చెబుతున్న మాటలు ఇలా ఉన్నాయి.. 

పశ్చిమబెంగాల్ షాలిమార్ నుంచి చెన్నై వెళుతున్న కోరమండల్ ఎక్స్ ప్రెస్ 2023, జూన్ 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు షాలిమార్ స్టేషన్ లో బయలుదేరి.. ఆరున్నర గంటలకు బాలాసోర్ చేరుకుంది. అక్కడి నుంచి బయలుదేరిన ఈ  రైలు.. బాలేశ్వర్ దగ్గరకు రాగానే.. పట్టాలు తప్పి  పక్క ట్రాక్ పై.. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  కోరమండల్ కు చెందిన 12 బోగీలు చెల్లాచెదురుగా పక్కనే ఉన్న మూడో రైల్వే లైన్ (ట్రాక్)పై కొన్ని బోగీలు పడ్డాయి. 

ఈ ప్రమాదం 6 గంటల 50 నిమిషాలకు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత 15 నిమిషాలకు అంటే.. 7 గంటల 15 నిమిషాల సమయంలో.. బెంగళూరు నుంచి హౌరా వెళుతున్న యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు.. పట్టాలపై పడిపోయిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ బోగీలను ఢీ కొట్టాయి. 

యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు.. 100 కిలోమీటర్ల వేగంతో బోగీలను ఢీకొనటంతో.. కోరండల్ బోగీలు తలకిందులు అయ్యాయి.. నుజ్జునుజ్జు అయ్యాయి. దీంతో ప్రమాద తీవ్రత పెరిగి.. ఎక్కువ మంది చనిపోవటానికి కారణం అయ్యింది అనేది ప్రాథమిక అంచనా..

ఇక్కడ ఓ విషయం అంతుచిక్కటం లేదు.. కోరమండల్ ఎక్స్ ప్రెస్.. యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రెండు రైళ్లు సూపర్ ఫాస్ట్.. వీటి వేగం గరిష్టంగా 100 నుంచి 130 కిలోమీటర్ల స్పీడ్ ఉంటుంది.. కోరమండల్ ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు అనేది ఓ పాయింట్ అయితే.. రావాల్సిన రైలు స్టేషన్ దాటకపోయినా స్టేషన్ అధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు అనేది మరో పాయింట్.. సహజంగా ఇలాంటి సూపర్ ఫాస్ట్ రైళ్లు స్టేషన్ నుంచి మరో స్టేషన్ ను 5 నుంచి 8 నిమిషాల్లోనే దాటేస్తాయి.. అలాంటిది యశ్వంత్ పూర్ ఎక్స్ ప్రెస్ రైలు వచ్చి ఢీకొనటానికి మధ్య గ్యాప్ 15 నిమిషాలుగా ఉన్నా.. సమీపంలోని రైల్వే స్టేషన్లలోని అధికారులకు ఎందుకు సమాచారం లేదు అనేది అంతుచిక్కటం లేదు.. 

కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం జరిగిన వెంటనే.. ఆ రైలు వెనక ఉండే గార్డ్ సమాచారం ఇచ్చారా లేదా అనే దానిపై క్లారిటీ రావటం లేదు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ లోని గార్డ్.. ప్రమాదం జరిగిన తర్వాత.. మిగతా ట్రాక్ పై వస్తున్న యశ్వంపూర్ రైలుకు.. తన దగ్గర ఉన్న ఎర్ర జెండాతో ఎందుకు అలర్ట్ చేయలేదు.. రాత్రి కాబట్టి గార్డ్ దగ్గర రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ సహజంగానే ఉంటాయి కదా.. ఇలాంటి ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి.

నాలుగు ట్రాకులు.. మూడు రైళ్లు.. రాత్రి 6 గంటల 50 నిమిషాల నుంచి.. 7 గంటల 10 నిమిషాల మధ్య.. ఆ 20 నిమిషాలు ఏం జరిగింది.. సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్ అయ్యిందా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనేది విచారణలో తేలాల్సి ఉంది.