కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికలకు దూరంగా లేననే సంకేతాలు ఇచ్చారు. తాను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానా? లేదా అనేది పార్టీ ఎన్నికలప్పుడు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఏం చేయాలో తానో నిర్ణయంపై ఉన్నానని తెలిపారు. అందులో ఎలాంటి గందరగోళం లేదన్నారు. అందమైన దేశంలో ఈ రెండు మూడు నెలలు యాత్ర చేపట్టడం ద్వారా పరిస్థితులు అర్థం చేసుకునేందుకు తనకు ఓ అవకాశం దొరుకుతుందన్నారు. కొన్ని విషయాలపై పూర్తిస్థాయి అవగాహనతో సమర్థంగా రాటుదేలగలను అనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. రెండు రోజుల తర్వాత కౌంటింగ్ చేపట్టి ఫలితం ప్రకటిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30 వ తేదీల వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్లో సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్లు ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారు. అందులో కపిల్ సిబల్, అశ్వనీకుమార్, గులాంనబీ ఆజాద్ హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. వారు బయటకు వెళ్తూ రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ కు రాజకీయ పరిపక్వత లేదని..అనుభవం లేని కారణంగా అనేక పరాజయాలు చవిచూడాల్సి వచ్చిందని ఆరోపించారు.
సెప్టెంబర్ 21న నాటికి కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. కానీ ఆ గడువును నెల రోజులు పొడిగించారు. 2019లో బీజేపీ ఘన విజయం సాధించి రెండోసారిప్రధాని మోడీ అధికారం కైవసం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.