
- పాక్ పై ప్రతీకార దాడి విషయంపై దేశ ప్రజలకు రాజ్ నాథ్ హామీ
- పహల్గాం ఉగ్రదాడికి తగిన జవాబు చెప్తామన్న రక్షణ మంత్రి
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో నరమేధానికి పాల్పడిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు తగిన రీతిలో బదులు చెప్తామని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ‘‘మీరు కోరుకుంటున్నది తప్పకుండా జరిగి తీరుతుంది” అంటూ దేశ ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజ్ నాథ్ మాట్లాడారు. ‘‘రక్షణ మంత్రిగా సైనిక బలగాలతో కలిసి పని చేయడం, దేశ సరిహద్దులను రక్షించడం నా బాధ్యత.
ఇండియాపై దాడికి పాల్పడిన వారికి మన జవాన్లతో కలిసి తగిన రీతిలో జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది” అని ఆయన చెప్పారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ సమర్థత, సంకల్పం, జీవితమంతా రిస్క్ లు తీసుకునేందుకు ఎలా సంసిద్ధులుగా ఉంటారు అన్నది.. ఆయన గురించి బాగా పరిచయం ఉన్న వాళ్లందరికీ తెలుసు. మోదీ పట్టుదల, నైతిక స్థైర్యం ఏమిటో మీ అందరికీ తెలుసు. నేను మీకు హామీ ఇస్తున్నా. ప్రధాని మోదీ నాయకత్వంలో.. ఇప్పుడు మీరు కోరుకుంటున్నది తప్పకుండా జరిగి తీరుతుంది” అని రాజ్ నాథ్ అన్నారు.
దేశ సరిహద్దులను మన వీర జవాన్లు నిరంతరం కాపాడుతుంటే.. దేశ ఆధ్యాత్మిక విలువలను సాధువులు, విజ్ఞులు కాపాడుతున్నారని చెప్పారు. ఒకవైపు మన సోల్జర్లు రణభూమిలో పోరాటం చేస్తుంటే.. మరోవైపు మన సాధువులు జీవనభూమిలో పోరాటం చేస్తున్నారని తెలిపారు. పహల్గాంలో 26 మందిని పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టులను అంతం చేయాలని, వారి వెనక ఉన్న పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పై ప్రతీకార దాడి తప్పదంటూ రాజ్ నాథ్ సింగ్ ఈ మేరకు హింట్ ఇచ్చారు.