
త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలని ఆర్టీసీ ఉద్యోగుల విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: తమ రిటైర్మెంట్ వయసు పెంచుతామన్న సీఎం కేసీఆర్ హామీని వెంటనే అమలు చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ఇటీవలి సమ్మె ముగిసే ముందు సీఎం కేసీఆర్ ప్రకటించిన అంశాలపై ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నెలాఖర్లో 103 మంది ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ కానున్నారు. వెంటనే వయసు పెంపు జీవో ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఫైలు ఆర్థిక శాఖ వద్దే పెండింగ్లో ఉండటంతో సీఎం చొరవ చూపాలంటున్నరు.
ఇంకా టైం పట్టొచ్చు!
‘ఆర్టీసీలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్లకు పెంచుతం. అధికారులు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగులు మంచిగ పనిచేసి లాభాలు తేవాలె’.. అని ఈ నెల ఒకటిన ప్రగతిభవన్లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్టీసీ అధికారులు 2,3 రోజుల్లోనే ఫైలు సిద్ధం చేసి, ఆర్థిక శాఖకు పంపారు. ఫైల్ అక్కడే పెండింగ్లో ఉండిపోయింది. క్లియర్ కావడానికి టైం పట్టొచ్చని అధికారులు చెప్తున్నరు. అనుమతి రాగానే ఉత్తర్వులు జారీ చేస్తామని అంటున్నరు. అయితే ఈ నెలాఖర్లో 103 మంది పదవీ విరమణ చేయనున్నారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో మరో రెండేళ్లు పనిచేయొచ్చని ఉద్యోగులు ఆశ పెట్టుకున్నారు.
ఒకేసారి చైల్డ్ కేర్ లీవ్
మహిళా కండక్టర్లకు మూడు నెలల చైల్డ్ కేర్ లీవ్ ఇస్తమని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. గ్రీన్ సిగ్నల్ రాగానే అమలు చేయనున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు నెలలు మెటర్నిటీ లీవ్ ఇస్తారు. తర్వాత 15 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఉంటుంది. విధుల్లో చేరాక అవసరం ఉన్నప్పుడు 15 రోజుల చొప్పున 3 నెలలు లీవ్ తీసుకోవచ్చు. ఆర్టీసీలో మాత్రం ఒకేసారి 9 నెలలు తీసుకునేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది.