టీకా కోసం వస్తే.. కాలు ఇరుక్కుపోయింది

టీకా కోసం వస్తే.. కాలు ఇరుక్కుపోయింది

కరీంనగర్​జిల్లా శంకరపట్నం పీహెచ్​సీ ముందున్న ఇనుప గ్రిల్స్ మధ్యలో ఓ బాలుడి కాలు ఇరుక్కుపోవడంతో 2 గంటలు నరకయాతన అనుభవించాడు. కరోనా వ్యాక్సిన్​వేయించుకునేందుకు ఇప్పల గ్రామానికి చెందిన గుడిసె రమ, కొమురయ్య తన మనుమడు అభిలాష్​ను వెంటబెట్టుకుని సోమవారం శంకరపట్నం పీహెచ్ సీకి వచ్చారు. లోనికి వెళ్తున్న టైంలో గేటు వద్ద ఉన్న ఇనుప గ్రిల్స్​లో అభిలాష్​కుడి కాలు ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాకపోవడంతో చివరికి వైద్య సిబ్బంది వెల్డర్​ని పిలిపించి ఇనుప రాడ్లను కట్​ ​చేయించారు. అప్పటికే రెండు గంటల పాటు బాలుడు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. కాగా ఈ నెల 5వ తేదీన రాజాపూర్ గ్రామానికి చెందిన చిర్ర భారతమ్మ అనే మహిళకు ఇదే పరిస్థితి ఎదురైంది. అధికారులు అప్పుడే పట్టించుకుని ఉంటే ఇప్పుడు బాలుడికి ఇలా జరిగేది కాదని స్థానికులు అంటున్నారు. అదృష్టవశాత్తు బాలుడి కాలికి ఏం కాలేదని చెప్పారు.