అఖిల్ గిరి వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

అఖిల్ గిరి వ్యాఖ్యలపై మండిపడ్డ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమబెంగాల్ మంత్రి అఖిల్ గిరి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో మంత్రి అఖిల్ గిరిని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీని ఎప్పుడు తొలగిస్తారు..? అని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. అయితే రాష్ట్రపతి ముర్ముపై చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి స్పందించకపోవడం గమనార్హం. ఆ మంత్రి మాటలు వినడం తమకు ఇష్టం లేదని స్మృతి ఇరానీ అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి అఖిల గిరిని పార్టీ నుంచి మమతా బెనర్జీ ఎప్పుడు తొలగిస్తారో తెలుసుకోవాలని ఉందన్నారు. 

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఉద్దేశిస్తూ పశ్చిమబెంగాల్ మంత్రి అఖిల్ గిరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎవరినైనా సరే రూపాన్ని బట్టి జడ్జ్ చేయడం ఇష్టముండదన్న ఆయన.. రాష్ట్రపతి అంటే తమకు ఎంతో గౌరవముందని చెప్పారు. కానీ, ఆమె చూడడానికి ఎలా ఉంటారు అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో బీజేపీ నేతలు అఖిల్ గిరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని, మంత్రి పదవి నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.