రాష్ట్రపతి ఎన్నికకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

రాష్ట్రపతి ఎన్నికకు కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

ఢిల్లీ : భారత 15వ రాష్ట్రపతి ఎవరన్నది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ భవనంలో రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. పార్లమెంట్ భవనం రూమ్ నంబరు 63లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెలువడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రపతి పీఠం కోసం అధికార ఎన్డీయే కూటమి నుంచి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా పోటీ చేశారు. జులై 18న జ‌రిగిన‌ రాష్ట్రపతి ఎన్నికల్లో 99.12 ఓటింగ్ శాతం నమోదైంది. రాష్ట్రపతి ఎన్నికలో 4,754 ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.   

కొనసాగుతున్న కౌంటింగ్ 
రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్‌ ఈ నెల 18వ తేదీన పార్లమెంటు భవనంతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగింది. రాష్ట్రపతి ఎన్నికకు ప్రధాన రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పి.సి.మోడీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఎంపీలు, ఎమ్మెల్యేల బ్యాలెట్‌ పేపర్లను వేరు చేస్తారు. ముందుగా ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఇంగ్లీషు అక్షరమాల ప్రకారం ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ఉంటుంది. 10 రాష్ట్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపు పూర్తయ్యాక ఒకసారి, 20 రాష్ట్రాల కౌంటింగ్‌ ముగిశాక మరోసారి ప్రధాన రిటర్నింగ్‌ అధికారి ఫలితం సరళిని వెల్లడిస్తారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యాక తుది ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈ ఎన్నికలో ఒక్కో ఎంపీ ఓటు విలువను 700గా నిర్ణయించారు. ఎమ్మెల్యేల ఓటు విలువ వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాన్ని బట్టి ఉంటుంది.

గెలుపెవరిది..?
ముర్ముకు మెజార్టీ ఉండటంతో ఆమె విజయం లాంఛనమేనని తెలుస్తోంది. ముర్ము విజేతగా నిలిస్తే రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఇక ఈ అత్యున్నత పీఠాన్ని అధిరోహించే రెండో మహిళ కూడా ముర్ము కానుండటం మరో విశేషం. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈనెల 24వ తేదీతో ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈనెల 25వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు.