టోకు ధరల ద్రవ్యోల్బణం డిసెంబరులో ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరింది. ఆహార వస్తువులు, ఖనిజాలు, యంత్రాల ధరలు పెరగడంతో ఇది 0.83 శాతంగా నమోదైంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రతికూల స్థాయిలో ఉన్న టోకు ధరల సూచీ డిసెంబర్లో పెరిగింది. 2024 డిసెంబర్లో ద్రవ్యోల్బణం 2.57 శాతంగా ఉంది. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం 1.33 శాతం నుంచి 1.82 శాతానికి ఎగిసింది.
ఆహార వస్తువుల ధరల తగ్గుదల నవంబర్లో 4.16 శాతం ఉండగా, డిసెంబర్లో 0.43 శాతానికి పరిమితమైంది. కూరగాయల ధరల్లో తగ్గుదల కూడా గణనీయంగా తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 1.33 శాతానికి పెరిగింది. ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను 1.25 శాతం తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటును 7.3 శాతానికి సవరించింది.
