
హైదరాబాద్, వెలుగు: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి జెన్కో రూపొందించిన అంచనాలు, బీహెచ్ఈఎల్ కోట్ చేసిన రేటు, జరిగిన నెగోషియెషన్స్, ఒప్పందం విలువ తదితర అంశాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియెట్లో ఎనర్జీ సెక్రటరీ రిజ్వీతో కలిసి బీహెచ్ఈఎల్ అధికారులతో యాదాద్రి పవర్ ప్లాంట్పై డిప్యూటీ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.
జాప్యానికి కారకులు ఎవరు?
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం జాప్యానికి కారకులు ఎవరని అధికారులను ప్రశ్నించారు. అగ్రిమెంట్ ప్రకారం 2020 అక్టోబర్ నాటికి యాదాద్రి ప్లాంట్లో రెండు యూనిట్లు, 2021 అక్టోబర్ నాటికి మరో మూడు యూనిట్లు పూర్తి చేసుకొని మొత్తం 4,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణం ఇప్పటి వరకు పెండింగ్లో ఉండటానికి గల కారణాలేంటని ప్రశ్నించారు. కాంపిటీటివ్ బిడ్డింగ్ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్ పద్ధతిలో బీహెచ్ఈఎల్కు ఎందుకు పనులు అప్పగించారని ప్రశ్నించారు.
ఫండ్స్ టైమ్కు ఇవ్వక లేటు..
రూ.34,500 కోట్ల పనుల్లో బీహెచ్ఈఎల్కు అప్పగించిన పనుల విలువ ఎంతని అధికారులను భట్టి ప్రశ్నించారు. బీహెచ్ఈఎల్కు రూ.20,444 కోట్లు విలువజేసే పనులు అప్పగించారని, మిగిలిన పనులను జెన్కో, ఇతర సంస్థలు చేపట్టాయని అధికారులు వివరించారు. తమకు ఇచ్చిన పనుల్లో రూ.15,860 కోట్ల పనులు పూర్తి చేయగా, రూ.14,400 కోట్ల చెల్లింపులు చేశారన్నారు. రూ.1167 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని బీహెచ్ఈఎల్ అధికారులు వివరించారు. గత ప్రభుత్వం చెల్లింపులు విడతల వారీగా చేయలేదని, 2023 మార్చి ఒక్క నెలలోనే 91శాతం పేమెంట్ చేశారన్నారు. నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో తాము సబ్ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేక పోయామని, దీంతో పనులు సజావుగా జరగలేదని వివరించారు.
అన్ని పర్మిషన్లు వస్తే 2025లో పూర్తి
పర్యావరణ అనుమతులను ఏప్రిల్ 2024 నాటికి తీసుకువస్తే తాము సెప్టెంబర్ 2024 వరకు రెండు యూనిట్లు, డిసెంబర్ 2024 వరకు మరో రెండు యూనిట్లు, 2025 మే నాటికి మిగిలిన ఒక యూనిట్ను పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని బీహెచ్ఈఎల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో బీహెచ్ఈఎల్ సీఎండీ కొప్పు సదా శివమూర్తి, డైరెక్టర్ తజీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
పనులు ఎందుకు పూర్తి కాలె
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి రూ.34,500 కోట్ల అంచనాలతో 2015 జూన్ 6న బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకోగా, 2017 అక్టోబర్లో వర్క్ ఆర్డర్ జారీ చేశారని, ఈ అగ్రిమెంట్ ప్రకారం 2021 నాటికి పనులన్నీ ఎందుకు పూర్తి కాలేదు.. ఇంకా కరెంట్ ఉత్పత్తి ఎందుకు ప్రారంభం కాలేదు.. అని భట్టి ప్రశ్నించారు. తమకు టైమ్కు బిల్లులను చెల్లించలేదని అందుకే జాప్యం జరిగిందని బీహెచ్ఈఎల్ అధికారులు వివరించారు. అంతే కాకుండా పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఇబ్బందులు జాప్యానికి కారణమని తెలిపారు.