కరోనా విషయంలో తమ పార్టీ రాజకీయాలు చేయాలనుకోవడం లేదని బీజేపీ సీనియర్ నేత ఈ.పెద్దిరెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడుకోవడమే ముఖ్యమని, ఈ విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఎంత బాధ్యత ఉందో తమకూ అంతే బాధ్యత ఉందని తెలిపారు. నిన్న బీజేపీ నిర్వహించిన వర్చువల్ జన్ సంవాద్ ర్యాలీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా కట్టడిపై సూచనలు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను చెబితే.. వాటిని సరిదిద్దుకోవాల్సింది పోయి టీఆర్ఎస్ నేతలు విమర్శలకు దిగడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా కట్టడిలో లోపాలను దిద్దుకోవాలని చెప్పారు పెద్దిరెడ్డి. ఏ సమస్యలు లేకుంటే గాంధీ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారో చెప్పాలన్నారు. కరోనా వస్తే రాజకీయ నేతలు గాంధీ హాస్పిటల్కు వెళ్లకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎందుకు అడ్మిట్ అవుతున్నారని ప్రశ్నించారు. కరోనా విషయంలో సీఎం చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయని అడిగారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ ఎందుకు అమలు చేయడం లేదని, పేదవాడు ప్రైవేటు హాస్పిటల్స్కి వెళ్లొద్దా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. రాబోయే రోజుల్లో బీజేపీ అన్ని మాట్లాడుతుందని, అవినీతి గురించి ప్రశ్నిస్తామని చెప్పారు పెద్దిరెడ్డి. ఘర్షణాత్మకంగా వ్యవహరిస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.