
రోజురోజుకి సమాజంలో సంబంధాలు, నమ్మకాలు పలచబడిపోతున్న తీరుకు అద్దం పట్టే సంఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఆస్తి కోసం కొందరైతే.. వివాహేతర సంబంధాలతో మరి కొందరు భార్యలు భర్తలను చంపుతున్నారు. ఈ మధ్యన ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఇలాంటి ఘటనే హైదరాబాద్ కుత్బుల్లాపూర్ దుండిగల్ పీఎస్ పరిధిలో జరిగింది. అయితే భర్తను చంపాలనుకున్న భార్య ప్లాన్ బెడిసి కొట్టింది. భర్త గాయాలతో బయటపడటంతో భార్య అసలు భాగోతం భయటపడింది.
బాచుపల్లి పీఎస్ పరిది రాజీవ్ గృహకల్పలోరాందాస్ నాయక్, జ్యోతి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లకు 2009లో పెళ్లి జరిగింది. కొన్ని గొడవల కారణంగా గత మూడు సంవత్సరాలుగా విడిగా ఉంటున్నారు. నెల క్రితం ఇద్దరితో కుటుంబ పెద్దలు చర్చలు జరిపి సయోధ్య కుదిర్చారు. అయితే వారం రోజుల నుంచి మళ్లీ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో జులై 26న రాత్రి భర్త రాందాస్ ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి ప్లాన్ చేసింది భార్య జ్యోతి. బౌరంపేట్ లో ప్లాన్ ప్రకారం భర్తకు మద్యం తాగించి అక్కడే బీర్ సీసాలతో, రాళ్లతో దాడి చేయించింది భార్య జ్యోతి. అపస్మారక స్థితిలోకి వెళ్లిన రాందాస్ మృతిచెందాడని అక్కడి నుంచి పారిపోయారు యువకులు. గంట సేపటి తర్వాత అర్ధరాత్రి రక్తపు గాయాలతో సాయి నగర్ లోని తన తమ్ముడి ఇంటికి చేరుకుని విషయాన్ని చెప్పాడు భాదితుడు రాందాస్. అనంతరం అతని తమ్ముడు బాచుపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించాడు. తర్వాత బాధితుడితో కలిసి బాచుపల్లి పీఎస్ లో పిర్యాదు చేశారు. హత్యకు జరిగిన ప్లాన్ దుండిగల్ పీఎస్ కిందికి వస్తుందని జీరో ఏఫ్ఐఆర్ చేసి దుండిగల్ పీఎస్ కు కేసు ట్రాన్స్ ఫర్ చేశారు పోలీసులు.
భర్తపై హత్యాయత్నానికి కారణం తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యాయత్నానికి గొడవలే కారణమా? లేక వివాహేతర సంబంధమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.