ఓ భార్య తన భర్తను హత్య చేసి కిచెన్లో పాతిపెట్టిన భయంకరమైన ఘటన మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలో జరిగింది. ప్రమీల అనే 32 ఏళ్ల మహిళ.. తన భర్తను హత్య చేసి, కిచెన్లో పాతిపెట్టడమే కాకుండా.. అదే కిచెన్లో నెలరోజులగా వంట చేసుకుంటుంది.
నెల రోజుల క్రితం అంటే కచ్చితంగా గత నెల అక్టోబర్ 22న తన భర్త అయిన మహేష్ బన్వాల్ కనిపించడం లేదంటూ అతని భార్య ప్రమీల స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నెల రోజులుగా మహేష్ ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తూనే ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి మహేష్ సోదరుడు అర్జున్ పోలీసులను సంప్రదించి మహేష్ కనిపించకపోవడంపై వదిన ప్రమీల మీద అనుమానం వ్యక్తం చేశాడు. తాను, తన కుటుంబ సభ్యులు నెల రోజులుగా మహేష్ ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించగా… మహేష్ కనిపించకపోవడానికి తామే కారణమంటూ ప్రమీల నిందలు వేసిందట. దాంతో అర్జున్ అనుమానంతో పోలీసులను ఆశ్రయించాడు. ఆ అనుమానమే పోలీసులు కేసును ఛేదించడానికి ఉపయోగపడింది.
అర్జున్ అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు మహేష్ ఇంటిని సందర్శించారు. అప్పుడు వారికి ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ప్రమీలపై అనుమానం మరింత బలపడింది. మహేష్ ఇంటిని మొత్తం పరిశీలించగా కిచెన్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులు గ్రహించారు. వెంటనే అక్కడ తవ్వగా కుళ్లిన స్థితిలో మహేష్ మృతదేహం లభించింది. వెంటనే ప్రమీలను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తన సోదరుడైన గంగారాం సహాయంతోనే తాను ఈ హత్య చేసినట్లు ప్రమీల ఒప్పుకుంది. భర్త మహేష్కు.. గంగారాం భార్యతో అక్రమ సంబంధం ఉందని.. అందుకే తామిద్దరం మహేష్ను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే గంగారాం మాత్రం మహేష్ హత్యతో తనకు ఎటువంటి సంబంధం లేదని అంటున్నాడు.
కాగా.. ఒక మహిళ ఒక్కతే తన భర్తను హత్య చేసి.. కిచెన్లో గొయ్యి తీసి పాతిపెట్టడం ఎలా సాధ్యమైందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ఎవరైనా సాయం చేసి ఉంటారని.. అది తొందరలోనే కనిపెడతామని పోలీసులు అంటున్నారు.