
డెహ్రాడూన్: దేశం కోసం సొంత కుటుంబాన్ని సైతం దూరంపెట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి త్వరలో గుడి కడతానంటున్నాడు ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే గణేశ్ జోషి. ఇటీవలనే మోడీకి హారతి అని ఇటీవల ప్రారంభించిన ఈ ఎమ్మెల్యేగారు.. మోడీకి గుడి కట్టితీరుతానంటూ శపథం చేస్తున్నాడు. లాక్ డౌన్ ఎత్తివేయగానే గుడి కట్టే పనులు మొదలెడతానంటున్నారీయన. ముస్సోరి నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించిన గణేశ్ జోషి.. శుక్రవారం కొవిడ్-19 వారియర్స్కు సన్మానం సందర్భంగా మోడీకి హారతి అనే ప్రార్థనను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ సమక్షంలోనే డాక్టర్ రేణు పంత్ రచించిన మోడీకి ఆరతిని చదివి వినిపించారు.
జోషి పాడుతున్న హారతిపై విపక్షాలు వ్యంగ్యాస్థ్రాలు విసురడంతో.. ఇప్పుడు మోడీకి గుడి కట్టి అందులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తానంటున్నారు. నరేంద్ర మోడీ ప్రపంచ స్థాయి నేత, ఆయనకు గుడి కట్టడంలో తప్పేమీ లేదని తాను భావిస్తున్నట్టు గణేశ్ జోషి చెప్తున్నారు. తన ఇంట్లో దేవత విగ్రహాలతోపాటు ఆయన ఫొటోను పెట్టి 1999 నుంచి పూజిస్తున్నానని చెప్పారు. 2016లో డెహ్రాడూన్ లో పోలీస్ అశ్వం శక్తిమాన్పై దాడి చేసి దాని కాలు విరగ్గొట్టిన కేసులో గణేశ్ జోసి నిందితుడు.