- మీడియాపై ఏపీ ప్రభుత్వం రాజద్రోహం కేసును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
- సెడిషన్కు పరిమితులు పెట్టాల్సిన టైమ్ వచ్చిందన్న ధర్మాసనం
- చానళ్ల పిటిషన్పై నాలుగు వారాల్లో స్పందించాలని ఆదేశం
న్యూఢిల్లీ: సర్కారు వ్యతిరేక వార్తలు రాస్తే రాజద్రోహం కేసు పెడ్తారా అని సుప్రీంకోర్టు ఏపీ సర్కారును తప్పుబట్టింది. ప్రభుత్వాలను విమర్శిస్తూ వార్తలు ప్రసారం చేస్తే, రాస్తే అది రాజద్రోహం కాదని చెప్పింది. సెడిషన్ (రాజద్రోహం)కు పరిమితులు విధించాల్సిన టైమ్ వచ్చిందని అభిప్రాయపడింది. టీవీ5, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై ఆంధ్రప్రదేశ్ సర్కారు నమోదు చేసిన రాజద్రోహం కేసును ఆ రెండు చానళ్లు సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. ఆ కేసును కోర్టు సోమవారం విచారించింది. ఆ రెండు చానళ్లు, వాటి ఉద్యోగులపై ఏపీ సర్కారు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. చానళ్లు వేసిన పిటిషన్పై 4 వారాల్లో స్పందించాలని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని స్పెషల్ బెంచ్ ఏపీ సర్కారుకు నోటీసులు జారీ చేసింది. విచారణ సందర్భంగా రెండ్రోజుల కిందట యూపీలోని ఓ నదిలో కరోనా డెడ్ బాడీని పడేసిన ఫొటోలను ఓ టీవీ చానల్ ప్రసారం చేసిందని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ప్రస్తావించారు. దానికి జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ.. ‘అలా ప్రసారం చేసినందుకు ఆ చానల్పైన కూడా రాజద్రోహం కేసు పెట్టారేమో’ అని కామెంట్ చేశారు.
రఘురామ కామెంట్స్ ప్రసారం చేసినందుకు..
కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ అధికార పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విమర్శించారు. ఆ కామెంట్స్ను చూపించినందుకు టీవీ5, ఏబీఎన్ చానళ్లపై రాజద్రోహం కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే కరోనా అంశాల విషయంలో మీడియాను నియంత్రించొద్దని ఇటీవలి సుప్రీంకోర్టు ఆదేశాలను చూపుతూ ఈ రెండు చానళ్లు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఆదేశాలను ఏపీ సర్కారు ఉల్లంఘించిందన్నాయి. తమ రెండు చానళ్లే కాకుండా మరికొన్ని చానళ్లూ రఘురామ కృష్ణంరాజు కామెంట్స్ను ప్రసారం చేశాయని వాదించాయి.