- షాపులు తెరిచేందుకు అనుమతి
- మాల్స్, మార్కెట్లు మాత్రం క్లోజ్
న్యూఢిల్లీ: లాక్డౌన్లో కేంద్రం ఇచ్చిన సడలింపులను ఢిల్లీలో కూడా అమలు చేస్తామని సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు నివాస ప్రాంతాల్లో షాపులు తెరుచుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ విషయాలు చెప్పారు. దేశ రాజధానిలో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కేజ్రీవాల్ చెప్పారు. షాపింగ్ మాల్స్ తప్పించి ఇతర షాపులన్నీ ఓపెన్ చేసుకునేందుకు అనుమతిస్తూ శుక్రవారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కాగా.. ఢిల్లీ ప్రభుత్వం మాత్రం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆదివారం మీటింగ్ తర్వాత ప్రకటిస్తామని ప్రకటించింది. “ ఎషెన్షియల్ సర్వీస్ కిందకు వచ్చే ముడికల్, కూరగాయలు, పండ్లు, డైరీ ఓపెన్ ఉంటాయి. షాపింగ్ కాంప్లెక్స్లు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయడానికి వీలు లేదు. కేంద్రం ప్రకటించినట్లు నివాస ప్రాంతాల్లో షాపులు ఓపెన్ చేయొచ్చు. కేంద్రం ప్రకటించిన మిగతా ఆంక్షలు మే 3 వరకు ఢిల్లీలో కొనసాగుతాయి. ఆ తర్వాత కూడా కేంద్రం చెప్పినట్లుగానే ముందుకు వెళ్తాం” అని కేజ్రీవాల్ చెప్పారు. కంటైన్మెంట్ జోన్లు, రెడ్ జోన్లలో సడలింపులు ఉండవని అన్నారు. పోయిన వారంతో పోలిస్తే ఈ వారంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గిందని అన్నారు. చావు బతుకుల్లో ఉన్న పేషంట్కు ప్లాస్మా థెరపీ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తే ఆయన కోలుకున్నారని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాను డొనేట్ చేయాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 3578 కేసులు రాగా.. 54 మంది చనిపోయారు.
