హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చితీరుతామని సీఎం రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) అధ్యక్షులు బొల్లోజు రవి, కోశాధికారి చిలుకూరి అయ్యప్ప, డైరెక్టర్లు దండా రామకృష్ణ, సభ్యులు క్రాంతి తదితరులు సెక్రటేరియెట్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఈ విషయంపై సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కూడా చర్చించాలని డీజేహెచ్ఎస్ ప్రతినిధులకు సూచించారు. అనంతరం తాము జర్నలిస్టులకు ఎలా ఇండ్ల స్థలాలు కేటాయించాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
బొల్లోజు రవి మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పాటైన ఈ పదేండ్ల కాలంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు అంశం ఒక కలగానే మిగిలిపోయిందని సీఎంకు ఇచ్చిన వినతిపత్రంలో ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇండ్ల స్థలాల అంశాన్ని చేర్చాలని ఎన్నికల సమయంలో కలిసి విన్నవించిన విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించారు. జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేసే విశాల హృదయం సీఎం రేవంత్రెడ్డికి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.