బిజినెస్ డెస్క్, వెలుగు: రేడియో, వాచ్లు, కెమెరా వంటి అనేక గ్యాడ్జెట్లను రిప్లేస్ చేస్తూ వచ్చిన స్మార్ట్ఫోన్లు, తాజాగా డెబిట్ కార్డులనూ భర్తీ చేయడానికి రెడీ అయ్యాయి. యూపీఐను తీసుకురావడంతో దేశ పేమెంట్ సెక్టార్ దశదిశ మారిందని చెప్పాలి. ఇప్పటి వరకు ఆన్లైన్, ఆఫ్లైన్ ట్రాన్సాక్షన్లకు మాత్రమే పరిమితమైన యూపీఐని, ఇక మీదట నుంచి ఏటీఎం క్యాష్ విత్డ్రాలకు కూడా వాడుకోవడానికి బ్యాంకులకు, ఫైనాన్షియల్ కంపెనీలకు అవకాశం కుదిరింది. యూపీఐ కార్డులెస్ విత్డ్రాలతో భవిష్యత్లో డెబిట్ కార్డుల అవసరం తగ్గిపోతుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దేశంలో డెబిట్ కార్డులను ఎక్కువగా వాడుతోందని క్యాష్ విత్డ్రాల కోసమే. ఇప్పటికే చాలా బ్యాంకులు తమ సొంత ఏటీఎంల నుంచి కార్డ్లెస్ విత్డ్రాలు చేసుకోవడానికి అవకాశం కలిపిస్తున్నాయి. కానీ, ఈ సెగ్మెంట్లోకి యూపీఐ కూడా ఎంటర్ అయితే కార్డు లెస్ విత్డ్రాలు మరింత మెరుగ్గా మారతాయని ఆర్బీఐ భావిస్తోంది. ‘ప్రస్తుతం డెబిట్ కార్డులను ఎక్కువగా వాడుతోంది ఏటీఎంల దగ్గరే. యూపీఐ ద్వారా మనీ విత్డ్రా చేసుకుంటే డెబిట్ కార్డుల అవసరం తగ్గిపోతుంది’ అని సర్వత్రా టెక్నాలజీస్ ఎండీ మందర్ అగాశి అన్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం, ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 2.55 లక్షల కోట్లను డెబిట్ కార్డుల ద్వారా కస్టమర్లు విత్డ్రా చేసుకున్నారు.
వ్యాపారులకు ఎక్కువ మేలు..
మర్చంట్లు కూడా కార్డులపై కంటే యూపీఐ పైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. కార్డులను వాడడం ద్వారా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) కింద బ్యాంకులకు, కార్డు నెట్వర్క్ కంపెనీలకు, పాయింట్ ఆఫ్ సేల్ను ప్రొవైడ్ చేసే కంపెనీలకు వ్యాపారులు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ కొనుగోళ్లపై అయితే పేమెంట్ గేట్వే కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. అదే యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్లు జరిగితే ఎటువంటి ఎండీఆర్ ఛార్జీలు ఉండవు. యూపీఐ ద్వారా అయితే సెల్లర్లకు పేమెంట్స్ వెంటనే అందిపోతాయి. కార్డుల ద్వారా జరిగిన పేమెంట్స్ మర్చంట్ అకౌంట్కు రావడానికి కనీసం ఒక్కరోజైనా పడుతుంది. క్యూఆర్ కోడ్ విత్డ్రాలకు సపోర్ట్ చేసేలా ఏటీఎంలలో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయాల్సి ఉంటుందని పేమెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఒకరు పేర్కొన్నారు. ఏటీఎంలలో సాఫ్ట్వేర్ను అప్డేట్ చేయడం పెద్దగా ఖర్చుతో కూడుకున్నది కాదని అన్నారు. కొత్తగా ఏర్పాటయిన ఏటీఎంలలో కొన్ని క్యూఆర్ కోడ్లను అంగీకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. డైనిమిక్ క్యూఆర్ కోడ్స్ అయితే పేమెంట్ వాల్యూ కోడ్లోనే కలిసి ఉంటుందని, అదే స్టాటిక్ క్యూఆర్ కోడ్స్ అయితే అమౌంట్ను ఎంటర్ చేసి క్యాష్ విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
రెండూ కలిసి కొనసాగొచ్చు..
డెబిట్ కార్డులు, యూపీఐ రెండు కలిసి కొనసాగుతాయని మరికొంత మంది మార్కెట్ ఎక్స్పర్టులు అంచనావేస్తున్నారు. దేశంలో మెజార్టీ ప్రజలకు స్మార్ట్ఫోన్లు లేవని, దీంతో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం కుదరదని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలోని 40 కోట్ల మందికి స్మార్ట్ఫోన్లు లేవని అంచనా. చాలా మంది యూపీఐ కంటే కార్డులను వాడడంలో కంఫర్ట్గా ఫీలవుతారని ఫినో పేమెంట్స్ బ్యాంక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆశిష్ అహుజా అన్నారు. క్యూఆర్ కోడ్ అవసరం లేకపోయినా యూపీఐ ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకునే విధంగా ఇన్నోవేటివ్ ఫీచర్ను బ్యాంకులు తీసుకురావాలని చెప్పారు. అలా అయితే స్మార్ట్ఫోన్లు లేకపోయినా యూపీఐ క్యాష్ విత్డ్రాలు విస్తరిస్తాయని అన్నారు. డెబిట్ కార్డులు పూర్తిగా కనుమరుగవ్వవని, వీటితో కేవలం క్యాష్ విత్డ్రాలు చేయడమే కాకుండా ఓవర్సీస్ ట్రాన్సాక్షన్లను ఎనబుల్ చేసుకోవడం వంటి ఇతర ప్రయోజనాలూ ఉన్నాయని యాక్సెంచర్ ఇండియాకు చెందిన సోనాలి కులకర్ణి అన్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ అయినా, ఇంటర్నెట్ కనెక్టివిటీ అధ్వాన్నంగా ఉన్నా, డెబిట్ కార్డుల ద్వారా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు