హైదరాబాద్, వెలుగు: మహిళా స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్లను సపోర్టు చేసేందుకు వీ హబ్ స్టార్టప్ ఇండియా, డీపీఐఐటీ(డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్) లతో కలిసి శుక్రవారం వింగ్(విమెన్ రైజింగ్ టుగెదర్) ప్రోగ్రామ్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా దేశంలో ఏడాదికి 7,500 మంది విమెన్ ఎంటర్ప్రెన్యూర్లకు సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. తెలంగాణలో వింగ్ ప్రోగ్రామ్ వీ హబ్, కేఎస్యూఎం(కేరళ స్టార్టప్ మిషన్) సహకారంతో నడుస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇంక్యుబేషన్ను, ఇన్వెస్టర్లను పొందడంలో విమెన్ ఎంటర్ప్రెన్యూర్లకు సహాయం అందిస్తారు. వీటితోపాటు వారి బిజినెస్కు మద్దతిస్తారు. 2017 లో హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ తర్వాత వీ హబ్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని కేటీఆర్ అన్నారు.
అనుకున్న ఏడాదిన్నరలోనే వీ హబ్ను ఏర్పాటు చేసి, రాష్ట్రంలోని విమెన్ ఎంటర్ప్రెన్యూర్లకు సహాయమందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విమెన్ ఎంటర్ప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు అనేక పాలసీలను తీసుకొచ్చిందన్నారు. వీరికి అదనపు రాయితీలను అందించడం, సీడ్ క్యాపిటల్ను సమకూర్చడం వంటివి చేస్తుందని తెలిపారు. సామాజిక– ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే మహిళల పాత్ర కీలకమన్నారు. ప్రభుత్వమే వీళ్లకు తొలి కస్టమర్గా ఉంటుందని హామీ ఇచ్చారు.
వీహబ్ స్టార్టప్లు బెస్ట్
ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లడుతూ.. విమెన్ ఎంటర్ప్రెన్యూర్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వీ హబ్ లాంటి సంస్థలను ఏర్పాటుచేసిందని తెలిపారు. మహిళలు పచ్చళ్లు తయారు చేయడం, అప్పడాలు చేయడం వంటి హౌస్ హోల్డ్ బిజినెస్లనే చేయగలరని సమాజంలో తప్పుడు అభిప్రాయం ఉందన్నారు. వీ హబ్ నుంచి వచ్చిన స్టార్టప్ కంపెనీలు, తాను చూసిన ఇతర స్టార్టప్ల కంటే చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు. ఈ కంపెనీల సాంకేతిక అడ్వాన్స్డ్గా ఉందని తెలిపారు. డీపీఐఐటీ సహకారంతో వీ హబ్ తెలంగాణలోని విమెన్ ఎంటర్ప్రెన్యూర్లు వారి గమ్యానికి చేరుకోడానికి, బలమైన కంపెనీని నిర్మించుకోడానికి సహాయపడుతుందన్నారు. ఆలోచన పుట్టినప్పటి నుంచి అది విజయవంతమైన ఎంటర్ప్రెన్యూర్గా మారేంత వరకు వీ హబ్, తెలంగాణ విమెన్ ఎంటర్ప్రెన్యూర్లకు సహాయంగా ఉంటుందని వీ హబ్ సీఈఓ దీప్తీ రావుల అన్నారు.
దేశంలో 48 శాతం మహిళలున్నా, 90 శాతం స్టార్టప్ కో–ఫౌండర్లు మగవాళ్లేనని తెలిపారు. వీ హబ్ బిగినర్, అడ్వాన్స్డ్ వర్క్ షాప్లను నిర్వహిస్తుందని, మొదటి వర్క్ షాప్ జనవరి 22–23 న హైదరాబాద్లో ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ను స్టార్టప్ ఇండియా ప్రారంభించింది. స్టార్టప్ కంపెనీలు, ఇంక్యుబేటర్లు, యాక్సిలేటర్లు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. వివిధ రంగాలలోని ప్రతి సబ్ సెక్టార్లో ఒక స్టార్టప్ కంపెనీకి రూ.5 లక్షల ప్రెజ్మనీని ఇవ్వనున్నారు. ఒక ఇంక్యుబేటర్కు రూ.15 లక్షలు, ఒక యాక్సిలేటర్కు రూ. 15 లక్షల ప్రైజ్ మనీని స్టార్టప్ ఇండియా ప్రకటించింది.

