జనవరి 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్స్

జనవరి 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ వింటర్ సెషన్స్

 

  • రైతు భరోసా, కులగణన సర్వే, ఏడాది పాలనపై చర్చించే చాన్స్​
  • ఆర్వోఆర్, హైడ్రా తదితర బిల్లులకు ఆమోదం తెలిపే చాన్స్​
  • విద్యుత్ ​కమిషన్​ రిపోర్టునూ ప్రవేశపెట్టే అవకాశం

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌‌‌‌‌ వర్మ బుధవారం గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ చేశారు. 9న ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అసెంబ్లీ సమావేశమైన అరగంట లోపే వాయిదా వేస్తారు. అనంతరం బీఏసీ సమావేశం జరగనుంది. ఆ తరువాత ఎన్ని రోజులు అసెంబ్లీ జరుగుతుందనేది స్పష్టత రానుంది. కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఏడాది పాలన,  ప్రోగ్రెస్​రిపోర్టుపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సభ ముందుకు తీసుకురానున్నారు. కేబినేట్ సబ్ కమిటీ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించి  రైతుభరోసా విధివిధానాలను ఫైనల్​చేయనున్నారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే కులగణన సర్వే వివరాలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించనున్నట్టు తెలుస్తున్నది. అప్పటి వరకు కులగణన సర్వే పూర్తయి నివేదిక రావడంతో పాటు బీసీ డెడికేటెడ్​ కమిషన్ రిపోర్ట్​కూడా ఇచ్చే అవకాశం ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపును కూడా అసెంబ్లీలోనే వెల్లడించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. 

మూసీపై మరోసారి చర్చ.. 

రికార్డ్స్​ఆఫ్ రైట్స్​(ఆర్వోఆర్​–2024) బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నది. హైడ్రా, ఓఆర్ఆర్​దగ్గరలోని గ్రామాలు ఆయా మున్సిపాలిటీల్లో విలీనం తదితర బిల్లులపైనా చర్చించి ఆమోదించనుంది. ఇప్పటికే వీటికి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. మూసీ పునరుజ్జీవంపైనా మారోసారి అసెంబ్లీలో చర్చ పెట్టాలని సర్కార్​ భావిస్తున్నది. ఫోర్త్ సిటీ ఏర్పాటుపైనా చర్చించనున్నట్టు తెలిసింది. కాగా, బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్​కొనుగోళ్లు, యాదాద్రి, భద్రాద్రి పవర్​ప్లాంట్ల నిర్మాణాల్లో అక్రమాలపై జ్యుడీషియల్​కమిషన్​తో ప్రభుత్వం విచారణ చేయించింది. దీనికి సంబంధించిన రిపోర్ట్ ను కమిషన్​ ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. దీంతో అసెంబ్లీ కంటే ముందు జరిగే కేబినెట్​సమావేశంలో దీనిపై చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. అవసరమైతే అసెంబ్లీలోనూ కమిషన్​రిపోర్ట్​ను పెట్టే యోచనలో సర్కార్ ఉన్నట్టు తెలిసింది.