ముర్ము స్వగ్రామంలో సంబరాలకు సర్వం సిద్ధం

ముర్ము స్వగ్రామంలో సంబరాలకు సర్వం సిద్ధం

ఢిల్లీ : రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుపును ఆకాంక్షిస్తూ ఆమె స్వగ్రామం సంబరాలకు సిద్ధమైంది. తీపి వంటకాలు, ప్రత్యేక నృత్యాల కార్యక్రమాలకు ముర్ము గ్రామస్తులు ఏర్పాటు చేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము స్వగ్రామం ఒడిశా రాయ్‌రంగ్‌పూర్‌లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఇటు రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌ కోసం సర్వం సిద్ధమైంది. భారతదేశానికి 15వ రాష్ట్రపతి ఎవరు అవుతారనే సస్పెన్స్‌ మరికొన్ని గంట్లలో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం ఖాయమని రాయ్‌రంగ్‌పూర్‌ గ్రామస్తులు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే 20వేలకు పైగా స్పెషల్‌ లడ్డూలను తయారు చేయించారు ఆ ఊరి పెద్దలు. అంతేకాదు.. కోయ డ్యాన్సులతో బాణాసంచాలతో సంబరాలకు సర్వం సిద్ధం చేశారు. 

ముర్ము చదివిన పాఠశాలలో కోలాహలం నెలకొంది. ముర్ము దేశానికి సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని ఆ స్కూల్‌ మాజీ హెడ్‌ మాస్టర్‌, ముర్ముకు పాఠాలు నేర్పిన బిశ్వేశ్వర్‌ మోహంతి తెలిపారు. తమ స్కూల్‌లో చదివి రాష్ట్రపతి కాబోతున్నందుకు విద్యార్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముర్మును స్ఫూర్తిగా తీసుకుని చదువుతామంటూ విద్యార్థులు చెబుతున్నారు. ద్రౌపది ముర్ము రాష్ర్టపతిగా విజయం సాధిస్తే.. దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా నిలుస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా సంబరాలకు ఎన్డీయే కూటమి సిద్ధమవుతోంది. పలు రాష్ట్రాల్లో విజయోత్సవాలకు బీజేపీ సర్వం సిద్ధం చేసింది. 

జులై 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ జరిగింది. ఇవాళ పార్లమెంట్‌ హౌజ్‌లోని రూం నెంబర్‌ 63లో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులు చేరుకున్నాయి. కౌంటింగ్‌ నేపథ్యంలో రూమ్‌ నెంబర్‌ 63ని సైలెంట్‌ జోన్‌గా ప్రకటించారు.