
- పీపీవీఎఫ్ఆర్ యాక్ట్తో రైతులకు ఎంతో మేలు
- రైతుల హక్కులపై జరిగిన ప్రపంచ సదస్సులో ప్రెసిడెంట్ ముర్ము
న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల సవాళ్ల నేపథ్యంలో మొక్కల రకాలు, రైతుల హక్కుల పరిరక్షణపై భారతదేశం తెచ్చిన చట్టం ప్రాధాన్యత సంతరించుకుందని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చెప్పారు. ఈ చట్టాన్ని ప్రపంచం మొత్తం అనుసరించవచ్చని, అద్భుతమైన నమూనాగా ఉపయోగపడుతుందని అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ‘పుసా’ కాంప్లెక్స్లో రైతుల హక్కులపై తొలిసారి జరిగిన ప్రపంచ సదస్సులో ఆమె మాట్లాడారు. గతంలో ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్, ఫార్మర్స్ రైట్స్(పీపీవీఎఫ్ఆర్) యాక్ట్ను తీసుకురావడంలో ఇండియా లీడ్ తీసుకుందని చెప్పారు. రైతుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్, అగ్రికల్చర్కు అనుగుణంగా ఈ చట్టం ఉందని తెలిపారు. పీపీవీఎఫ్ఆర్ చట్టం ప్రకారం.. రైతులకు అనేక రకాల హక్కులను ఇండియా కల్పిస్తోందని వెల్లడించారు. రిజిస్టర్డ్ రకానికి చెందిన అన్ బ్రాండెడ్ విత్తనాలను ఉపయోగించడం, కాపాడటం, పంచుకోవడం, అమ్మడం వంటివి చేయొచ్చని తెలిపారు. రైతులు తమ సొంత రకాలను నమోదు చేసుకోవచ్చని, వారికి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. మొత్తం ప్రపంచం అనుసరించేందుకు అలాంటి చట్టం అద్భుతమైన నమూనాగా ఉపయోగపడుతుందని చెప్పారు. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్ల మధ్య.. ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడానికి ఇది ప్రాధాన్యం సంతరించుకుందని అన్నారు. ఈ సదస్సును యునైటెడ్ నేషన్స్ ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ ఫర్ ఫుడ్ సెక్రటేరియట్ సంయుక్తంగా నిర్వహించాయి.