హైకోర్టు ఉత్తర్వులతో.. ఎమ్మెల్యే మెడకు మినరల్​ ఫండ్ ఉచ్చు

హైకోర్టు ఉత్తర్వులతో.. ఎమ్మెల్యే మెడకు మినరల్​ ఫండ్ ఉచ్చు

హైకోర్టు షోకాజ్​ నోటీసులతో ఆఫీసర్లలో టెన్షన్​

ప్రైవేట్​ వెంచర్లకు సీసీ రోడ్ల సాంక్షన్​పై కలవరం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంఎఫ్​టీ ఫండ్స్​ దుర్వినియోగంపై హైకోర్టు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కలెక్టర్​ భారతి హోళికేరి, సీపీవో సత్యనారాయణరెడ్డితో పాటు ఏడుగురికి కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ కేసు ఎమ్మెల్యేతోపాటు ఆఫీసర్ల  మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

2018లో నెన్నెల, కాసిపేట, తాండూర్​ మండలాల్లోని వివిధ గ్రామాల్లో రోడ్లు ఇతర పనులకు డీఎంఎఫ్​టీ (డిస్ట్రిక్ట్​ మినరల్​ ఫండ్​ ట్రస్ట్​) కింద రూ.90 లక్షలు సాంక్షన్​ చేశారు. అనంతరం 2019లో వీటిని క్యాన్సిల్​ చేస్తూ బెల్లంపల్లి మున్సిపాలిటీ, కన్నాల గ్రామపంచాయతీతో పాటు నెన్నెల మండలంలో రెండు గ్రామాల్లో రోడ్లు సాంక్షన్​ చేశారు. వీటిలో కన్నాల గ్రామ పరిధిలోని రెండు రియల్​ ఎస్టేట్​ వెంచర్లలో రూ.53 లక్షలతో సీసీ రోడ్లు సాంక్షన్​ చేయడం వివాదాస్పదమైంది. ఈ పనులకు టెండర్​ కాల్​ చేయకుండా రూ.5లక్షల బిట్లుగా చేసి నామినేషన్​పై కాంట్రాక్టర్​కు కట్టబెట్టారు. ఇందులోని ఒక వెంచర్​లో ఎమ్మెల్యే ట్రిపుల్​ ఫ్లోర్​ బిల్డింగ్​ నిర్మిస్తున్నారు. ఈ వెంచర్లు తన అనుచరులవి కావడంతో వారికి లబ్ధి చేకూర్చేందుకే రూల్స్​ను బ్రేక్​ చేసి డీఎఫ్​ఎంటీ ఫండ్స్​ సాంక్షన్​ చేయించారని విమర్శలు వచ్చాయి. వీటిపై మీడియాలో కథనాలు రావడంతో ఆఫీసర్లు వెంచర్లలో జరుగుతున్న రోడ్డు పనులను నిలిపివేశారు. కేవలం కాంట్రాక్టర్​తో వర్క్​ అగ్రిమెంట్​ క్యాన్సిల్​ చేసి, పంచాయతీరాజ్​ ఏఈకి మెమో జారీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, నెన్నెల మండలం గొల్లపల్లి ఎంపీటీసీ మెంబర్​ బొమ్మెన హరీష్​గౌడ్​ ఈ నెల 6న హైకోర్టులో రిట్​ పిటిషన్​ ఫైల్​ చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఎమ్మెల్యే, కలెక్టర్​, సీపీవో, ఎంపీడీవో, పంచాయతీరాజ్​, ఆర్​డబ్ల్యూఎస్​ ఇంజనీర్లతో పాటు మొత్తం ఏడుగురికి ఈ నెల 18న షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. కేసును వచ్చే నెల 22కు వాయిదా వేసింది.

ఎమ్మెల్యే ఇంట్రెస్ట్​తోనే…

డీఎంఎఫ్​టీ ఫండ్స్​ సాంక్షన్​ విషయంలో ఎమ్మెల్యేలదే ప్రధాన పాత్ర. వారి నుంచి వచ్చిన ప్రపోజల్స్​ను ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలించి వర్క్స్​ సాంక్షన్​ చేయాల్సి ఉంటుంది. గతంలో డీఎఫ్​ఎంటీ కమిటీలో ప్రపోజల్స్​పై చర్చించి సాంక్షన్​ చేసేవారు. ఈ కమిటీలో జిల్లా ఇన్​చార్జి మంత్రి చైర్మన్​గా, కలెక్టర్​ కన్వీనర్​గా, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ఆఫీసర్లు మెంబర్లుగా ఉండేవారు. కానీ రెండోసారి టీఆర్​ఎస్ గవర్నమెంట్​ ఏర్పడిన తర్వాత జిల్లాలకు ఇన్​చార్జి మంత్రులను నియమించలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలే కీలకం కావడం, వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆఫీసర్లు పాకులాడడం వల్ల నిధుల దుర్వినియోగానికి ఆస్కారం కలిగింది.

హైకోర్టు నోటీసులతో కలవరం..

కన్నాలలోని ప్రైవేట్​ వెంచర్లకు డీఎంఎఫ్​టీ ఫండ్స్​ సాంక్షన్​ చేయడంపై కలెక్టర్​ భారతి హోళికేరి ఎంక్వైరీకి ఆదేశించి నెలరోజులవుతున్నా బెల్లంపల్లి ఎంపీడీవో నుంచి సరైన రిపోర్టు రాలేదని తెలిసింది. ఇప్పటికే రెండుసార్లు రిపోర్టు ఇచ్చినప్పటికీ సంతృప్తికరంగా లేకపోవడంతో మరోసారి డీటెయిల్డ్​ ఎంక్వైరీ రిపోర్టు కోరినట్టు సమాచారం. ఇప్పటివరకు పొలిటికల్​ ప్రెజర్​ కారణంగా అసలు విషయాన్ని తొక్కిపెట్టగా… తాజాగా హైకోర్టు నుంచి షోకాజ్​ నోటీసులు అందడంతో అందరిలో టెన్షన్​ మొదలైంది.

ఇవి కూడా చదవండి

4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?

హఫీజ్​పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు

చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!

ఫేస్ బుక్-వాట్సప్‌లలో చర్చిస్తారు.. ఓఎల్‌‌ఎక్స్ లో అమ్మేస్తారు

పోలీసులే దొంగలైతే!.. చెకింగ్ పేరుతో లూటీ