హైకోర్టు షోకాజ్ నోటీసులతో ఆఫీసర్లలో టెన్షన్
ప్రైవేట్ వెంచర్లకు సీసీ రోడ్ల సాంక్షన్పై కలవరం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో డీఎంఎఫ్టీ ఫండ్స్ దుర్వినియోగంపై హైకోర్టు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కలెక్టర్ భారతి హోళికేరి, సీపీవో సత్యనారాయణరెడ్డితో పాటు ఏడుగురికి కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ కేసు ఎమ్మెల్యేతోపాటు ఆఫీసర్ల మెడకు చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.
2018లో నెన్నెల, కాసిపేట, తాండూర్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో రోడ్లు ఇతర పనులకు డీఎంఎఫ్టీ (డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్) కింద రూ.90 లక్షలు సాంక్షన్ చేశారు. అనంతరం 2019లో వీటిని క్యాన్సిల్ చేస్తూ బెల్లంపల్లి మున్సిపాలిటీ, కన్నాల గ్రామపంచాయతీతో పాటు నెన్నెల మండలంలో రెండు గ్రామాల్లో రోడ్లు సాంక్షన్ చేశారు. వీటిలో కన్నాల గ్రామ పరిధిలోని రెండు రియల్ ఎస్టేట్ వెంచర్లలో రూ.53 లక్షలతో సీసీ రోడ్లు సాంక్షన్ చేయడం వివాదాస్పదమైంది. ఈ పనులకు టెండర్ కాల్ చేయకుండా రూ.5లక్షల బిట్లుగా చేసి నామినేషన్పై కాంట్రాక్టర్కు కట్టబెట్టారు. ఇందులోని ఒక వెంచర్లో ఎమ్మెల్యే ట్రిపుల్ ఫ్లోర్ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఈ వెంచర్లు తన అనుచరులవి కావడంతో వారికి లబ్ధి చేకూర్చేందుకే రూల్స్ను బ్రేక్ చేసి డీఎఫ్ఎంటీ ఫండ్స్ సాంక్షన్ చేయించారని విమర్శలు వచ్చాయి. వీటిపై మీడియాలో కథనాలు రావడంతో ఆఫీసర్లు వెంచర్లలో జరుగుతున్న రోడ్డు పనులను నిలిపివేశారు. కేవలం కాంట్రాక్టర్తో వర్క్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి, పంచాయతీరాజ్ ఏఈకి మెమో జారీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, నెన్నెల మండలం గొల్లపల్లి ఎంపీటీసీ మెంబర్ బొమ్మెన హరీష్గౌడ్ ఈ నెల 6న హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. దీనిపై విచారించిన కోర్టు ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీవో, ఎంపీడీవో, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో పాటు మొత్తం ఏడుగురికి ఈ నెల 18న షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేసును వచ్చే నెల 22కు వాయిదా వేసింది.
ఎమ్మెల్యే ఇంట్రెస్ట్తోనే…
డీఎంఎఫ్టీ ఫండ్స్ సాంక్షన్ విషయంలో ఎమ్మెల్యేలదే ప్రధాన పాత్ర. వారి నుంచి వచ్చిన ప్రపోజల్స్ను ఆఫీసర్లు క్షుణ్ణంగా పరిశీలించి వర్క్స్ సాంక్షన్ చేయాల్సి ఉంటుంది. గతంలో డీఎఫ్ఎంటీ కమిటీలో ప్రపోజల్స్పై చర్చించి సాంక్షన్ చేసేవారు. ఈ కమిటీలో జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్గా, కలెక్టర్ కన్వీనర్గా, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు ఆఫీసర్లు మెంబర్లుగా ఉండేవారు. కానీ రెండోసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత జిల్లాలకు ఇన్చార్జి మంత్రులను నియమించలేదు. ప్రస్తుతం ఎమ్మెల్యేలే కీలకం కావడం, వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆఫీసర్లు పాకులాడడం వల్ల నిధుల దుర్వినియోగానికి ఆస్కారం కలిగింది.
హైకోర్టు నోటీసులతో కలవరం..
కన్నాలలోని ప్రైవేట్ వెంచర్లకు డీఎంఎఫ్టీ ఫండ్స్ సాంక్షన్ చేయడంపై కలెక్టర్ భారతి హోళికేరి ఎంక్వైరీకి ఆదేశించి నెలరోజులవుతున్నా బెల్లంపల్లి ఎంపీడీవో నుంచి సరైన రిపోర్టు రాలేదని తెలిసింది. ఇప్పటికే రెండుసార్లు రిపోర్టు ఇచ్చినప్పటికీ సంతృప్తికరంగా లేకపోవడంతో మరోసారి డీటెయిల్డ్ ఎంక్వైరీ రిపోర్టు కోరినట్టు సమాచారం. ఇప్పటివరకు పొలిటికల్ ప్రెజర్ కారణంగా అసలు విషయాన్ని తొక్కిపెట్టగా… తాజాగా హైకోర్టు నుంచి షోకాజ్ నోటీసులు అందడంతో అందరిలో టెన్షన్ మొదలైంది.
ఇవి కూడా చదవండి
4 నెలల క్లాసులకే మొత్తం ఫీజులా..?
హఫీజ్పేట భూ కబ్జాలపై మళ్లీ పోరాటం తప్పదు
చీటింగ్ పెట్రోల్ బంకులపై కేసుల్లేవ్.. ఓన్లీ జరిమానాలే!
ఫేస్ బుక్-వాట్సప్లలో చర్చిస్తారు.. ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తారు