రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో ఓ యువతి కిడ్నాప్ కు గురైంది.  తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తండ్రి చంద్రయ్యతో కలిసి హనుమన్ దేవాలయంలో పూజ చేసి బయటకు వస్తుండగా యువతిని కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. యువతి వచ్చే దారిలో అప్పటికే కారులో కాపు కాసి ఉన్న నలుగురు యువకులు...ఆమె తండ్రిని కొట్టి బలవంతంగా కారులో లాక్కెళ్లారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ వీడియోలో యువతిని బలవంతంగా లాక్కెళ్లి కారులో తోసివేసినట్టుగా పోలీసులు గుర్తించారు. కిడ్నాప్ నకు గురైన యువతి పెళ్లి ఈ మధ్యనే నిశ్చయం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైనర్ గా ఉన్న సమయంలో గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అతడిపై అప్పట్లో ఫోక్సో కేసు చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలోనే జైలుకి వెళ్లి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ యువకుడిపైనే అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు రెండు బృందాలతో తనిఖీలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. ఇయ్యాళ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన ఉన్నందున.. ఆ ప్రోగ్రామ్ పూర్తి కాగానే కిడ్నాప్ చేసిన వారిని పట్టుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. కాగా మూడపళ్లికి చేరుకున్నఅడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్ర చారి విచారణను కొనసాగిస్తున్నారు.

రోజూలాగే ఈ రోజు కూడా తాను, తన కూతురు కలిసి హనుమాన్ టెంపుల్ కి వెళ్లి, వస్తుండగా కట్కూరి జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి తనను కొట్టి, తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని యువతి తండ్రి చంద్రయ్య తెలిపారు. ఆ సమయంలో కట్కూరి ప్రశాంత్, కట్కూరి జ్ఞానేశ్వర్ అనే ఇద్దర్ని మాత్రమే తాను చూడగలిగానని, ఇంకొక ఇద్దరు ఎవరో చూల్లేదని చెప్పారు. ఎలాగైనా తమ కూతుర్ని క్షేమంగా రావాలని ఈ సందర్భంగా ఆయన వేడుకున్నారు.