మహిళా ఉద్యోగులపై వేధింపులు : మంత్రి సీతక్క

 మహిళా ఉద్యోగులపై వేధింపులు : మంత్రి సీతక్క
  • పంచాయతీ రాజ్ సీఈపై మంత్రి సీతక్కకు ఫిర్యాదు  

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పని చేసే చీఫ్ ఇంజినీర్(ఉపాధి హామీ క్వాలిటీ కంట్రోల్​ విభాగం) తమను తీవ్రంగా వేధిస్తున్నారని క్వాలిటీ కంట్రోల్(క్యూసీ) విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఉద్యోగులు బుధవారం  మంత్రి సీతక్కకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ, వేధింపులకు గురి చేస్తున్నారని, వీడియో కాల్స్ చేస్తూ సందేహాలు తీర్చాలని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మహిళా ఎస్​క్యూసీవోలు ఉన్న జిల్లాలో పర్యటించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారని పేర్కొన్నారు. 

ఆయన తీరుతో సిబ్బంది ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. వేధింపులు భరించలేక ఇద్దరు మహిళా జేక్యూసీవోలు ఉద్యోగం మానేశారని, పలువురు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారన్నారు. ఈ విషయాన్ని మంత్రి సీతక్క సీరియస్​గా తీసుకున్నారు. శాఖా పరమైన విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారుల నివేదిక ఆధారంగా సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళా ఉద్యోగులను వేధిస్తే సహించేది లేదని ఆమె హెచ్చరించారు.