
క్రికెట్ లో మహిళల పాత్రను మరింతగా పెంచేందుకు బీసీసీఐ మరో అడుగు ముందుకు వేసింది. దేశ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా పురుషుల క్రికెట్లో మహిళా అంపైర్లను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో మహిళా అంపైర్లు మైదానంలో కనిపించనున్నట్లుగా బీసీసీఐ వెల్లడించింది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మ్యాచ్ లలో కూడా మహిళా అంపైర్లు కనిపించే అవకాశం ఉందని తెలిపింది. ఇటీవలే మహిళా క్రికెటర్ల వేతనాలను పురుషులతో సమానంగా బీసీసీఐ పెంచింది. ఇక భారత్ లో వృందారతి, గాయత్రి వేణుగోపాలన్, జననీ నారాయణన్ భారత మహిళా జట్టు ఆడే క్రికెట్ మ్యాచ్ లకు అంపైర్లుగా పనిచేస్తున్నారు.
ముంబైకి చెందిన 32 ఏళ్ల వృందారతి న్యూజిలాండ్ అంతర్జాతీయ జట్టు అంపైర్ కాథీ క్రాస్ స్పూర్తితో అంపైర్ గా రాణిస్తున్నారు. గాయత్రి వేణుగోపాలన్ భుజం గాయం కారణంగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలనే కలలను దూరం చేసుకున్నారు. ఆ తరువాత అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబును వదిలేసి అంపైర్ గా కొనసాగుతున్నారు. 36 ఏళ్ల నారాయణన్ కు మొదట్లో క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఆ తర్వాత ఆట మీద ఆసక్తితో అన్ని విషయాలనూ తెలుసుకుంది.