
- 25 వేల ఉద్యోగాలు ఇస్తామంటూ 198 ఎకరాలు తీసుకున్న కంపెనీ
- నాలుగేండ్లుగా నిర్మాణానికే పరిమితమైన పనులు
- ఇంటర్వ్యూలంటూ మూడు నెలల కింద ప్రకటన.. ఆ తర్వాత సైలెంట్
- నీరు గారుతున్న వరంగల్ టెక్స్టైల్ పార్క్ లక్ష్యం
- ఎనిమిదేండ్లలో 200 మందికే లేబర్ ఉద్యోగాలు
వరంగల్, వెలుగు : వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్లో పార్క్లో ఏర్పాటు చేయనున్న కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీ పనులు ముందుకు సాగడం లేదు. వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తామంటూ ప్రభుత్వం నుంచి భూమిని తీసుకున్న యాజమాన్యం.. నాలుగేండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు యూనిట్ను ప్రారంభించలేదు. ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామంటూ మూడు నెలల కింద ప్రకటన జారీ చేసినా.. ఆ ప్రక్రియ కూడా అటకెక్కింది.
రూ. 1200 కోట్లతో యూనిట్ ఏర్పాటుకు అగ్రిమెంట్
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో రూ. 1200 కోట్ల ఖర్చుతో పిల్లల దుస్తుల తయారీ యూనిట్ను ప్రారంభించేందుకు కైటెక్స్ గార్మెంట్స్ సంస్థ గత ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది. దీంతో అప్పటి ప్రభుత్వం సంస్థకు 198 ఎకరాలను కేటాయించగా.. నిర్మాణ పనులకు 2021 జులై 7న అప్పటి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఏడాదిలోనే పనులు పూర్తి చేసి 25 వేల ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు అప్పట్లో ప్రచారం చేశారు. కైటెక్స్ సంస్థ ఏర్పాటు పనులు ప్రారంభమై నాలుగేండ్లు అవుతున్నా... పనులు మాత్రం పూర్తి కావడం లేదు.
సీఎం, మంత్రులు ఆదేశించినా...
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతేడాది జూన్ 29న సీఎం రేవంత్రెడ్డి వరంగల్ టెక్స్టైల్ పార్క్ను సందర్శించి, ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. తర్వాత మంత్రి శ్రీధర్బాబు, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి కైటెక్స్ సంస్థపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ ఏడాది జనవరిలో కంపెనీని ప్రారంభించాలని ఆదేశించారు. అయినా కంపెనీ ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందనా కనిపించలేదు.
ప్రకటనకే పరిమితమైన ఇంటర్వ్యూలు
కైటెక్స్ కంపెనీలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి కంపెనీ ప్రతినిధులు మూడు నెలల కింద ప్రకటన జారీ చేశారు. ఇందులో మేనేజర్లు మొదలుకొని మెకానికల్, సివిల్, ఎలక్ట్రిక్ ఇంజినీర్లు, సూపర్వైజర్లతో పాటు దుస్తుల తయారీలో అవసరమైన 12 రకాల విభాగాల్లో ఉద్యోగాల ఎంపికకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, అనుభవం ఉన్న వారు రెండు వారాల్లో అప్లై చేసుకోవాలని సూచించారు. మూడు నెలలు గడుస్తున్నా ఇంటర్వ్యూలు నిర్వహించడం లేదు.
అలాగే కైటెక్స్ కంపెనీలో స్థానికులకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో జాబ్మేళా నిర్వహించినా కంపెనీ ప్రతినిధులు స్పందించలేదు. మరో వైపు ఈ కంపెనీలో మహిళలకు అవకాశాలు ఉంటాయన్న ప్రచారంతో డీఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా గ్రూప్ సభ్యులకు టైలరింగ్లో ట్రైనింగ్ ఇప్పించారు. ఇప్పుడు వీరంతా కొలువుల కోసం ఎదురుచూస్తున్నారు.
1,357 ఎకరాల్లో 200 మందికి లేబర్ ఉద్యోగాలు
లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం వరంగల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లక్ష్యం నీరుగారుతోంది. ఈ పార్క్ను ప్రారంభించి తొమ్మిదేళ్లు అవుతున్నా ఇప్పటివరకు 200 మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కాయి. అవి కూడా హమాలీ, సెక్యూరిటీ గార్డ్ వంటి పోస్ట్లే కావడం గమనార్హం. టెక్స్టైల్ పార్క్ కోసం గత ప్రభుత్వం 2016లో వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలోని శాయంపేట, చింతలపల్లి వద్ద దశలవారీగా 1,357 ఎకరాలను సేకరించింది.
పార్క్ పనులకు 2017లో అప్పటి సీఎం కేసీఆర్ ముగ్గు పోశారు. ఇక్కడ ఏర్పాటు చేసే కంపెనీల ద్వారా మొదట్లో 65 వేలకు పైగా ఉద్యోగాలు దొరుకుతాయని, క్రమేపీ రెండేండ్లలో లక్ష మందికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఆ పార్క్లో గణేశా ఎకో పెట్, ఎకో టెక్ పేర్లతో రెండు యూనిట్లు మాత్రమే ప్రారంభం అయ్యాయి. ఇందులో హమాలీలతో పాటు సెక్యూరిటీ గార్డు వంటి ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. దక్షిణ కొరియాకు చెందిన యంగాన్ కంపెనీ 8 ఫ్యాక్టరీలు పెడుతున్నట్లు ప్రకటించినా అవి ఏర్పాటు కాలేదు.