ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా ట్రీట్​మెంట్ సెంటర్

ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా ట్రీట్​మెంట్ సెంటర్
  • నేలాఖరు నాటికి రెడీ చేయనున్న ఢిల్లీ ప్రభుత్వం
  • ఒకే సారి 10 వేల మందికి చికిత్స చేసే సదుపాయం

న్యూఢిల్లీ: కరోనాను కట్టడి చేయడంలో ఢిల్లీ ప్రభుత్వం మరింత స్పీడును పెంచింది. వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ట్రీట్​మెంట్ సెంటర్ ను రెడీ చేస్తోంది. దక్షిణ ఢిల్లీలోని 10,000 బెడ్స్ కెపాసిటీ ఉన్న రాధా సోమీ స్పిరిచ్యువల్ సెంటర్ ను కరోనా పేషెంట్ల ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా మారుస్తోంది.
ఛతార్ పూర్ లో12,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాధా సోమీ స్పిరిచ్యువల్ సెంటర్ 22 ఫుట్‌బాల్ గ్రౌండ్స్ విస్తీర్ణానికి సమానంగా ఉంటుంది. ఇక్కడ జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మూడు లక్షల మందికి పైగా పాల్గొంటారు. ఈ ప్రాంతమంతా సీసీ కెమెరాలు అమర్చి ఉన్నాయి. దీంతో కరోనా ట్రీట్​మెంట్ సెంటర్​గా ఈ కేంద్రాన్ని మార్చాలని నిర్ణయించిన ఢిల్లీ సర్కారు అందుకు కావాల్సిన ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

20 హాస్పిటల్స్ తో సమానం
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కేర్ మార్గదర్శకాల ప్రకారం ఇక్కడి సౌలత్​లు ఉన్నాయని, 500 బెడ్స్ కెపాసిటీ ఉన్న 20 హాస్పటల్స్ మాదిరిగా ఈ సెంటర్ పనిచేస్తుందని.. ఏర్పాటు పనులను పర్యవేక్షిస్తున్న దక్షిణ ఢిల్లీ కలెక్టర్ బీఎమ్ మిశ్రా తెలిపారు. ఎమర్జెన్సీ పెషెంట్లను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు రిఫర్ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సెంటర్ లో అంబులెన్సులు, టెస్టులు నిర్వహించేందుకు సొంత ల్యాబ్ ఫెసిలిటీలున్నాయని చెప్పారు. రెండు షిఫ్టులలో 400 మంది చొప్పున డాక్టర్లు పనిచేస్తారని తెలిపారు. పర్యవేక్షించేందుకు పారామిలిటరీ ఫోర్సెస్ పనిచేస్తాయన్నారు. ప్రస్తుతం కంప్యూటర్లు ఏర్పాటు చేస్తున్నామని జూన్ నెలాఖరు నాటికి ఈ సెంటర్ కరోనా ట్రీట్​మెంట్​కు రెడీ అవుతుందని చెప్పారు.

శానిటైజేషన్ కూడా అక్కర్లేదు
‘‘రాధా సోమీ సెంటర్ లో ప్రత్యేకతలు ఏంటంటే.. ఇక్కడన్నీ కార్డ్ బోర్డ్ బెడ్స్ ఉంటాయి. కార్డ్ బోర్డ్ పై 24 గంటల కన్నా ఎక్కువ సేపు వైరస్ నిలవదు కాబట్టి వీటిని శానిటైజ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే వాటిని రీసైకిల్ చేసుకోవచ్చు. బరువు తక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కడికైనా సులువుగా మార్చుకోవచ్చు” అని వాటిన తయారు చేసిన ధావన్ బాక్స్ షీట్ కంటెయినర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ విక్రమ్ ధావన్ చెప్పారు.

వేలాది మందికి భోజన సదుపాయం
‘‘లాక్​డౌన్ అమల్లోకి వచ్చాక ఈ సెంటర్ లో ఎంతోమంది కూలీలకు ఆశ్రయం కల్పించాం. ఇప్పటికే కొంతమంది వలస కార్మికులకు ఆశ్రయం పొందుతున్నారు. కమ్యూనిటీ కిచెన్ సెంటర్ల ద్వారా ఇక్కడ ఒకేసారి వేలాది మందికి భోజనం అందించగలిగే వెసులు బాటు ఉంది” అని రాధా సోమి సత్సంగ్ బియాస్ కార్యదర్శి వికాస్ సేథి చెప్పారు.