“అక్షర రూపం దాల్చిన ఓ సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక” ఈ వాక్యం అక్షరంతో పనిచేసే వ్యక్తులందరికీ వర్తిస్తుంది. రచయితలకు, కవులకు మన సమాజంలో విశిష్ట స్థానం ఉంది. ఇది ఎవరూ కాదనలేని విషయం. ఈ దేశ నాగరికత, గొప్పదనం గురించి చెప్పేది వాళ్లే. కవిత్వం రాసే వాళ్లని చూసి ‘వీళ్లకు ఏం వస్తుంది?’ అని చాలామంది అనుకుంటారు. ధనరూపేణా వాళ్లకి ఏమీరాదు. మరో విధంగా చెప్పాలంటే ఉన్న డబ్బుని వాళ్లు పోగొట్టుకుంటారు. కానీ, కవులకు చరిత్రలో విశిష్ట స్థానం వుంది.
ప్రపంచ చరిత్రలో మిగిలేది వాళ్లే.. కాదు.. గుర్తుండిపోయేది వాళ్లే.
ఏ దేశం గురించి మాట్లాడుకున్నా మనకు గుర్తుకొచ్చేది కవులే. రాజ్యాధినేతలు కాదు. ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకుంటే చాలామందికి గుర్తుకొచ్చేది అక్కడి కవులు మిల్టన్, వర్డ్స్ వర్త్, షేక్స్పియర్, షెల్లీ, కీట్స్ బైరన్, కొలిరిడ్జ్ ఇలా ఎందరో.
అమెరికా గురించి మాట్లాడుకుంటే మనకు ఎక్కువగా గుర్తుకు వచ్చే కవులు - టీఎస్ ఈలియట్, ఎమర్సన్, హెమ్మింగ్ వే, వాల్ట్స్ విట్మన్. మన దేశం గురించి మాట్లాడుకుంటే మనకు గుర్తుకొచ్చే కవులే - వాల్మీకి, పోతన, వ్యాసుడు, కాళిదాస్, ఠాగూర్, శ్రీ శ్రీ, దాశరథి, కాళోజీ. ఆ తర్వాత రామాయణం, భారతం, గీతాంజలి గుర్తుకొస్తాయి. చివరగా రాజ్యాధినేతలు గుర్తుకొస్తారు.
కవులు దేశానికి రక్తనాళాల్లాంటి వాళ్లు. కవులు ఆనందంగా ఉంటే దేశం ఆనందంగా, సుఖంగా ఉంటుంది. అయితే, దేశంలో ఆనందం ఉంటేనే కవులు ఆనందంగా ఉంటారు. దేశానికి నాయకులతో పాటు కవుల అవసరం ఉంటుంది. కవులు లేని దేశంలో అంధకారం ఉంటుంది. నాయకులు, రాజ్యాధినేతలు అందరూ నక్షత్రాల్లాంటి వారు. కవి అనేవాడు సూర్యుడిలాంటి వాడు. నక్షత్రాలు ఎన్ని ఉన్నా వెలుతురు రాదు. వెన్నెల ఉంటుంది. కానీ కావాల్సిన వెలుతురు ఉండదు.
కవులనే వాళ్లు జీవితాన్ని అనుభవిస్తారు. కొత్త కోణంలో చూస్తారు. మిగతా వ్యక్తులు జీవితాన్ని అనుభవించరని కాదు. వాళ్లూ అనుభవిస్తారు. స్పందిస్తారు. కానీ, ఆ స్పందనని అందించలేరు. కవులు స్పందిస్తారు. వాళ్లు పొందిన స్పందనని, అనుభవాన్ని ప్రజలకి అందిస్తారు.
ప్రకృతిని చూసి పరవశించే వాడు కవి...ప్రశ్నించే వాడు శాస్త్రవేత్త...
కవుల కోణం వేరే విధంగా ఉంటుంది. మనకు మామూలుగా కనిపించేది వాళ్లకి అద్భుతంగా కనిపిస్తుంది. వాళ్లు చూసిన విషయాన్ని మనకు అందిస్తారు. రెండు వస్తువులు ఉన్నాయి అనుకోండి. అవి మనకి మామూలుగా అందరికీ కనిపిస్తాయి. కానీ, కవులకు అవి విభిన్నంగా కనిపిస్తాయి. ఆ రెండు వస్తువుల్లో వాళ్లకు పోలికలు కనిపిస్తాయి. అదే సృజనాత్మకత.
పిల్లలు చిన్నప్పుడు డైరీల్లో లేదా పుస్తకాల్లో పిచ్చిగీతలు గీస్తారు. గోడల మీద పిచ్చిరేఖలు, బొమ్మలు గీస్తారు. వారి మాటలని పెద్దవాళ్లు క్యాసెట్లలో రికార్డు చేస్తారు. అవి సాధారణ వ్యక్తులకు మామూలుగానే కనిపిస్తాయి. కానీ, కవికి విభిన్నంగా కనిపిస్తాయి. ఇలాంటివి చూసిన నేను ఓ కవిత ఇలా అన్నాను.
‘ఈ పిచ్చి రేఖల్లో మీకు ఏమీ కన్పించకపోవచ్చు
బొమ్మా కన్పించక పోవచ్చు...బొరుసూ కన్పించక పోవచ్చు..కానీ నాకు మాత్రం..ఈ కాగితంలో
కాగితం పడవ ఉంది..కాగితం పడవలో వర్షం ఉంది..వర్షం వెనక ఏమీ ఎరగని బాల్యం ఉంది..ఈ కేసెట్ లో కేరింతలు ఉన్నాయి..ఆ కేరింతల్లో గొప్ప సంగీతం ఉంది..ఆ సంగీతం వెనుక నా భావావేశం ఉంది..ఈ చినిగిన డైరీలో..నాకే అర్ధమయ్యే అక్షరాలున్నాయి.. అక్షరాల వెనక ..అనంతమైన భాష ఉంది..భాష వెనక మృదు మధురమైన ..కవిత్వం ఉంది..
ఈ రేఖల్లో మీకు కనిపించని మా పాప ఉంది...ఆమె అద్భుతమైన బోసినవ్వుంది..ఆ బోసినవ్వులో
ఊగిపోయే నేనున్నాను’..రెండు వస్తువులని కవి భిన్నంగా దర్శిస్తాడు...అభిజ్ఞాన శాకుంతలంలో శకుంతలని పంపించేటప్పుడు కవి చూసిన దృశ్యం భిన్నంగా ఉంటుంది.
దుష్యంతుడు శకుంతలని తీసుకొని వెళుతుంటాడు. రథం పరుగెడుతుంది. కణ్వ మహర్షి చెక్కిలి మీద గోరు వెచ్చటి కన్నీరు జారుతూ ఉంటుంది. భర్త వెంట వెళ్లాలని, శకుంతలకి ఉంటుంది. మనస్సు తండ్రి వైపు లాగుతూ ఉంటుంది. రథం పైన జెండా కవికి మరో రకంగా దర్శనమిస్తుంది. ఇలా ఉంటుంది.ఆమె భర్తతో ముందుకు సాగుతుంది...ఆమె మనస్సు జెండాలాగ తండ్రివైపు లాగుతుంది.జెండాలాగ మనస్సు రెపరెపలాడుతుంది...కవి కంటికి, మామూలు కంటికి కనిపించే భేదం ఇదే.
రోడ్డు మనకి మామూలు రోడ్డులాగ కనిపిస్తుంది. కానీ, ఓ కవికి అది రకరకాలుగా కనిపిస్తుంది. రక్తసిక్తమై భయపెట్టే దినపత్రికలాగ, నల్లగా మారిన మనిషి రక్తం లాగ, బకాసురుడిలాగ, నాలుక సాచిన రాక్షసిలాగ, ల్యాండ్ మైన్లా కనిపిస్తుంది.
రోజూ విపరీతంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి నా అభివ్యక్తీకరణ నా మాటల్లో...
‘‘ఈ విశాలమైన రోడ్డుని చూస్తే..రక్తసిక్తమై భయపెట్టే దినపత్రిక గుర్తుకొస్తుంది నాకు..రోడ్డు మీద ‘డాంబరు’ని చూస్తే..ఎండిపోయి నల్లగా మారిన మనిషి రక్తమే..గుర్తొస్తుంది నాకు..కిక్కిరిసిపోయి నడవలేని ఈ రోడ్డుని చూస్తే ..శవయాత్రే గుర్తొస్తుంది నాకు ..శ్వాసకూడా సరిగ్గా తీయలేని ఈ రోడ్డుని చూస్తే..రక్త దాహంతో ఆయాసపడే బకాసురుడే గుర్తొస్తాడు నాకు..నాకీ రోడ్డు రాక్షసి సాచిన నాలుకలా కనిపిస్తోంది..నాకీ రోడ్డు నల్లకోటు తొడుక్కున్న న్యాయవాదిలా కన్పిస్తుంది...ఈ రోడ్డుని ఎవడు కనిపెట్టాడో గానీ..నాకీ రోడ్డు రోజూ పేలుతున్న ల్యాండ్ మైన్లా కన్పిస్తోంది’’
జాన్ డోన్ అనే ఇంగ్లీష్ కవి తన భార్య గురించి ‘వృత్తలేఖిని’ అన్న కవిత చెబుతాడు. మామూలు వృత్త లేఖిని అతను భార్యాభర్తల రూపంలో దర్శిస్తాడు. అతని భార్య అతన్ని బయటకు వెళ్లొద్దని అంటుంది. అప్పుడు అతను ఇలా అంటాడు. ‘భౌతికంగా విడిపోతానేమో కానీ మానసికంగా నీతో కలిసే వుంటాన’ని చెబుతూ ‘వృత్తలేఖిని’ గుర్తుకు తెస్తాడు.
ఒక వృత్తం గీస్తున్నప్పుడు వృత్తలేఖనిలోని ఒక కాలు గుండ్రంగా తిరిగి మరో కాలును కలుస్తుంది. ఈ వృత్తం గీసే క్రమంలో అది పైన కలిసే ఉంటుంది. నేను బయటకు వెళ్లినా మళ్లీ కలుస్తాను. భౌతికంగా దూరంగా ఉన్న వృత్తలేఖిని పైభాగంలాగ నిన్ను మానసికంగా కలిసే ఉంటాను.పోలికలు, కోణాలు, చూపు కవులవి విభిన్నంగా ఉంటాయి. అవి మన మనస్సుల్ని తాకుతాయి. హత్తుకుపోతాయి.
కవులు ఏం చేస్తారు...కవిత్వం రాస్తారు...డబ్బుల కోసం కాదు...మనస్సు కోసం...అందుకే చిట్టచివరిగా మిగిలేది కవులే...రాజ్యాధినేతలు కూడా ఏమీ తీసుకుని వెళ్లరు..
ఎంతమంది. రాజులు గుర్తున్నారు...?
“పోయిరి పాదుషాలు..పడిపోయినవి సౌదంలెల్ల..మాయమైపోయే సమస్త సంపదలు..పోవుచూ
పూచిక పుల్లనైనా కొనిపోయేరా !’’..ఇది అప్పుడూ, ఎప్పుడూ.
రోడ్డు మనకి మామూలు రోడ్డులాగ కనిపిస్తుంది. కానీ, ఓ కవికి అది రకరకాలుగా కనిపిస్తుంది. రక్తసిక్తమై భయపెట్టే దినపత్రికలాగ, నల్లగా మారిన మనిషి రక్తం లాగ, బకాసురుడిలాగ, నాలుక సాచిన రాక్షసిలాగ, ల్యాండ్ మైన్లా కనిపిస్తుంది.
- డా. మంగారి రాజేందర్, కవి, రచయిత,9440483001-
