మందుకొట్టమని పైసలిచ్చిన వైసీపీ మంత్రి

మందుకొట్టమని పైసలిచ్చిన వైసీపీ మంత్రి

వైసీపీ మంత్రి గమ్మనురు జయరాం వైఖరి వివాదాస్పదంగా మారింది. సమస్య పరిష్కారం కోసం వచ్చిన ఓ వ్యక్తికి డబ్బులిచ్చి మందు తాగి బాధ మరిచిపొమ్మని చెప్పడం వివాదాస్పదంగా మారింది. మంత్రి నోట ఆ మాట విని చుట్టుపక్కలున్న వారు ఆశ్చర్యపోయారు. మంత్రికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 

 కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని సులువాయి గ్రామంలో వైసీపీ మంత్రి గమ్మనురు జయరాం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ఇంతలో ఓ వ్యక్తి మంత్రి గమ్మనురు వద్దకు వచ్చి తన కొడుకు సరిగా చూసుపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అతని బాధ విని కొడుకును కాస్త మందలించి ఆ తండ్రికి న్యాయం చేస్తాడని పక్కనున్న వారంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా జయరాం తన జేబులోంచి రూ.500 నోటు తీసి ఆ వ్యక్తి చేతిలో పెట్టాడు. ఆ డబ్బుతో మందు తాగి బాధ మర్చిపొమ్మంటూ ఉచిత సలహా ఇచ్చాడు. మంత్రి చెప్పిన పరిష్కారం చూసి అవాక్కవడం జనం వంతైంది. కష్టం తీరుస్తారని వచ్చిన వ్యక్తికి మంత్రి డబ్బిచ్చి మరీ మందు తాగమని చెప్పడంపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.