రెవెన్యూ శాఖ  రాబరీ శాఖగా మారింది..ఆ శాఖకు పొంగులేటి మంత్రిగా అనర్హుడు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

       రెవెన్యూ శాఖ  రాబరీ శాఖగా మారింది..ఆ శాఖకు పొంగులేటి మంత్రిగా అనర్హుడు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
  • మంత్రి కంపెనీలకు రూ.15 వేల కోట్ల ఆస్తుల బదిలీ
  • ఆయన ఆస్తులపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి
  • భూ దోపిడీపై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి పాలనలో రెవెన్యూ శాఖ కాస్తా రాబరీ శాఖగా మారిపోయిందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 22ఏ సెక్షన్‌‌‌‌‌‌‌‌ను అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయల భూ దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం స్కెచ్ వేసిందని చెప్పారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చి రైతులను వేధిస్తున్నారని విమర్శించారు. ముందు పట్టా భూమిని 22ఏలో పెట్టడం.. పర్సంటేజీ ముట్టాక బయటకు తీయడం కాంగ్రెస్ మార్క్ భూదందా అని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఎకరాలపై ఆంక్షలు విధించి ఆర్టికల్ 300ఏ ప్రకారం ప్రజలకున్న ఆస్తి హక్కును కాలరాస్తున్నారని విమర్శించారు.

పొంగులేటి కంపెనీలకు కోట్ల ఆస్తులు

బీఆర్ఎస్ హయాంలో కల్వకుంట్ల కుటుంబానికి బినామీగా ఉన్న ఫీనిక్స్ కంపెనీ నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన రాఘవ కన్​స్ట్రక్షన్స్, నోవా వంటి కంపెనీలకు రూ.15 వేల కోట్ల విలువైన ఆస్తులు బదిలీ అయ్యాయని ఏలేటి ఆరోపించారు.  ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, హైటెక్ సిటీ, గాజులరామారంలోని విలువైన భూములు, కమర్షియల్ టవర్లు ఈ బదిలీల్లో ఉన్నాయని పేర్కొన్నారు. టీఐఐసీ నుంచి ఫీనిక్స్ కంపెనీకి భూమి కేటాయించిన మరుసటి రోజే.. రాఘవ కన్​స్ట్రక్షన్స్తో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. ఈ భారీ లావాదేవీలపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందో సమాధానం చెప్పాలన్నారు.

ధరణి పోయినా ధోరణి మారలేదు: ఈటల రాజేందర్ 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను కాపాడాల్సింది పోయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ తరహాలో వ్యవహరిస్తూ లక్షల కోట్ల రూపాయల భూదందాకు తెరతీసిందని మల్కాజ్‌‌‌‌‌‌‌‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ధరణి పోయినా ధోరణి మారలేదని, భూభారతితో పేదలకు తీరని అన్యాయం 
జరుగుతున్నదన్నారు.

బీఆర్ఎస్ ఎందుకు నోరు విప్పట్లే?

గత ప్రభుత్వంలోని అవినీతిపై చర్యలు తీసుకోకపోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న చీకటి ఒప్పందమే కారణమని ఏలేటి విమర్శించారు. 22ఏ తప్పులను అంగీకరించిన మంత్రి పొంగులేటి వెంటనే రాజీనామా చేయాలని, బాధ్యులైన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఇందులో వాటా లేకపోతే వెంటనే లోకాయుక్త విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ భూ దోపిడీ వ్యవహారంపై ఈడీ, సీబీఐ వరకు వెళ్లేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు.