
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు బడుల బాగు కోసం టీచర్లు, యూనియన్లు ఏడాదిపాటు అన్నీ పక్కనపెట్టి పనిచేయాలని విద్యాశాఖ సెక్రటరీ యోగితరాణా పిలుపునిచ్చారు. గవర్నమెంట్స్కూళ్లను దత్తత తీసుకొని, వాటి బాగు కోసం కృషి చేయాలని సూచించారు. ఆయా బడుల్లో ఏమైనా వసతులు అవరముంటే.. తాము ఆర్థికంగా సహకారం అందిస్తామని తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ బిల్డింగ్లో టీచర్ల సంఘాలతో యోగితారాణా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదని, దీన్ని నిరోధించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
సర్కారు స్కూళ్ల బలోపేతం, వాటిలో అడ్మిషన్ల పెంపునకు టీచర్ల సంఘాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. సర్కారు బడుల్లో ట్రైయిన్డ్ టీచర్లు ఉన్నా.. పేరెంట్స్ మాత్రం అడ్మిషన్లు తీసుకోవడం లేదన్నారు. కాబట్టి, పేరెంట్స్, స్టూడెంట్లలో స్కూళ్ల పట్ల నమ్మకం కల్గించేలా టీచర్లు కృషి చేయాలని కోరారు. అనంతరం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి.. రాష్ట్రంలో న్యాస్, ఆసర్ సర్వేల్లో విద్యార్థుల పరిస్థితిని, సర్కారు బడుల్లో ఎన్ రోల్ మెంట్ ఎలా తగ్గుతుందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సర్కారు స్కూళ్ల బలోపేతంపై పలువురు టీచర్ల సంఘాల నేతలు సూచనలు ఇచ్చారు.