
- కొడుకుతో గొడవ పడి కూతురింటికి చేరిన మహిళ
- తల్లిని పంపించాలని తన అక్కకు ఫోన్ చేసిన వ్యక్తి
- స్పందించకపోవడంతో ఆమె కొడుకును ఎత్తుకెళ్లిన యువకుడు
- హనుమకొండ యాదవనగర్లో ఘటన
వరంగల్, వెలుగు : తనతో గొడవ పడి వచ్చిన తల్లిని తిరిగి పంపాలని కోరినా స్పందించకపోవడంతో ఓ యువకుడు తన అక్క కొడుకునే కిడ్నాప్ చేశాడు. హనుమకొండ యాదవనగర్లో జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. హనుమకొండ సీఐ సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా మంథని ముత్తారానికి చెందిన ఓ మహిళ తన కొడుకు ప్రశాంత్తో గొడవ పడి హనుమకొండ యాదవనగర్లో ఉంటున్న కూతురు జ్యోతి వద్దకు వచ్చింది.
దీంతో ప్రశాంత్ తన అక్క జ్యోతికి ఫోన్ చేసి తల్లిని తిరిగి పంపించాలని కోరాడు. అయినా వారు వినకపోవడంతో గురువారం సాయంత్రం హనుమకొండలోని జ్యోతి ఇంటి వద్దకు వచ్చాడు. తర్వాత అక్కడే ఆడుకుంటున్న జ్యోతి కొడుకు, తన మేనల్లుడైన మూడేళ్ల అవినాశ్ను కిడ్నాప్ చేసి తన వెంట తీసుకెళ్లాడు. అవినాశ్ కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన జ్యోతి చుట్టుపక్కల వారిని అడుగగా బాబును ప్రశాంత్ తీసుకెళ్లినట్లు చెప్పారు.
దీంతో వెంటనే హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రశాంత్కు ఫోన్ చేయగా స్విఛాప్ రావడంతో సిగ్నల్స్ ఆధారంగా కరీంనగర్, ముత్తారం ఏరియాలో ఉన్నట్లు గుర్తించారు. స్థానిక పోలీసుల సాయంతో అక్కడికి వెళ్లి చిన్నారిని హనుమకొండకు తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.