డబ్బు కోసం గొడవ.. తల్లిని చంపిన కొడుకు వివరాలు వెల్లడించిన పోలీసులు

డబ్బు కోసం గొడవ.. తల్లిని చంపిన కొడుకు వివరాలు వెల్లడించిన పోలీసులు

రామడుగు, వెలుగు :   తండ్రి బ్యాంక్ అకౌంట్​ నుంచి రూ. 10 లక్షలు జల్సాల కోసం ఖర్చుచేసి, ఇంట్లో గొడవ జరుగగా..  తల్లిని చంపేశాడు చిన్న కొడుకు.  కరీంనగర్ జిల్లా రామడుగు మండలకేంద్రానికి చెందిన ఈరెల్లి గౌరమ్మ (60) హత్య కేసులో  చిన్నకొడుకు  అనిల్​కుమార్​ నిందితుడని  రూరల్​ ఏసీపీ విజయకుమార్​ తెలిపారు. రామడుగు పోలీస్​ స్టేషన్​లో శనివారం  ప్రెస్​మీట్​ నిర్వహించారు.  రామడుగు గ్రామానికి చెందిన ఈరెల్లి గౌరమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు మహేష్ సింగపూర్ నుంచి కొన్నిరోజుల క్రితం ఇంటికి వచ్చాడు.  

ఈ నెల 8న అతని పెళ్లి ఉంది.  మహేశ్​కు చెందిన రూ.5 లక్షలు, వడ్లు అమ్మిన  రూ.4 లక్షలు, రైతుబంధు  రూ.లక్ష తండ్రి కొమురయ్య బ్యాంకు ఖాతాలో జమ చేశారు. ఈ డబ్బులను చిన్న కొడుకు అనిల్​కుమార్ జల్సాలకు ఖర్చు చేశాడు. ఈ  విషయమై ఇంట్లో గొడవలు జరగగా అనిల్​కుమార్​ ఈ నెల 5న ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న తల్లి మెడను కోసి హత్యచేశాడు. మహేశ్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి అనిల్​కుమార్​ను శనివారం అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు పేర్కొన్నారు.