తెలంగాణ ఎన్నికల బరిలో యూత్..చిన్న వయసులోనే పొలిటికల్ ​ఎంట్రీ

తెలంగాణ ఎన్నికల బరిలో యూత్..చిన్న వయసులోనే పొలిటికల్ ​ఎంట్రీ
  • ప్రధాన పార్టీల్లో టికెట్లు దక్కించుకున్న యువత
  • చిన్న వయసులోనే పొలిటికల్ ​ఎంట్రీ 
  • అత్యధికంగా యంగ్​స్టర్స్​కు టికెట్లు ఇచ్చిన బీఎస్పీ

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల్లో ఈసారి యూత్​కు అవకాశం వచ్చింది. అనూహ్యంగా టికెట్లు దక్కించుకున్న యువత.. చిన్న వయసులోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నారు. ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే.. చట్టసభకు వెళ్లాలనే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అధికార బీఆర్ఎస్ పార్టీ115 మంది అభ్యర్థులను ప్రకటించింది. షెడ్యూల్​వచ్చిన తర్వాత కొన్ని చోట్ల మార్పులు చేర్పులు చేసిన బీఆర్ఎస్..యువతకు అవకాశం ఇచ్చింది. ములుగులో బడే నాగజ్యోతికి టికెట్​దక్కింది.

ఆమె వయసు 29 ఏండ్లు మాత్రమే. కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందటంతో ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్ఎస్ అవకాశం కల్పించింది. ఈమె వయసు 36 ఏండ్లు.  కోరుట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే విద్యా సాగర్ వయోభారం, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున ఆయన కుమారుడు సంజయ్ కు కోరుట్ల టికెట్ దక్కింది. ఇల్లందు బరిలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ వయసు 38 ఏండ్లు మాత్రమే.

హుజూర్ బాద్ టికెట్ దక్కించుకున్న ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి వయసు 40లోపే. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ యాకత్ పురాకు వెళ్లగా, నాంపల్లి టికెట్ ను ఎంఐఎం మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ కు కేటాయించింది. ఈయన వయసు 43 ఏండ్లు. ఎంఐఎం అభ్యర్థుల్లో ఇతనే యంగ్. 

కాంగ్రెస్ పార్టీలో..

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల్లో అనూహ్యంగా కొన్ని టికెట్లు యువతను వరించాయి. పాలకుర్తిలో కాంగ్రెస్ టికెట్ ను ఝాన్సి రాజేందర్ రెడ్డి ఆశించగా ఆమెకు పౌరసత్వ సమస్య రావటంతో అనూహ్యంగా ఆమె కోడలు యశస్వినికి టికెట్​దక్కింది. ఈమె వయసు 27 ఏండ్లు మాత్రమే. నారాయణ పేట నుంచి టికెట్ దక్కించుకున్న  డీకే అరుణ అన్న కుమార్తె  పర్నిక చిట్టెం రెడ్డి వయసు కూడా 30 ఏండ్లలోపే.

కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న మైనంపల్లి రోహిత్ వయసు 30 లోపే. హుజూరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా వోడితెల ప్రణవ్ బాబుకు టికెట్ దక్కింది. ఈయన ఏజ్ 36 ఏండ్లు. ఇలా కాంగ్రెస్​పార్టీలో యువతకు ఈసారి అవకాశం దక్కింది.

బీజేపీలో పులువురికి టికెట్లు

బీజేపీలోనూ యూత్ కు టికెట్లు దక్కాయి. జగిత్యాల నుంచి టికెట్ దక్కించుకున్న  బోగ శ్రావణి వయస్సు 40 లోపు కావటం గమరార్హం. మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డి, నాగార్జున సాగర్ నుంచి నివేదితా రెడ్డి, మహబూబాబాద్ నుంచి హుస్సేన్ నాయక్ లు, భూపాలపల్లి నుంచి టికెట్ దక్కించుకున్న కీర్తి రెడ్డి 40 ఏళ్ల లోపు వయసు ఉన్నవారే. జనసేన కూడా ఖమ్మం నుంచి ఓయూ జేఏసీ నేత రామకృష్ణకు అవకాశం ఇచ్చింది. బీఎస్పీ నుంచి ఎక్కువ మంది యూత్ కు టికెట్లు దక్కాయి.

ఇందులో దేవరకొండ నుంచి వెంకటేశ్ చౌహాన్ , పెద్దపల్లి నుంచి దాసరి ఉష, నకిరేకల్ నుంచి మేడి ప్రియదర్శినితో పాటు రెండు లిస్ట్ లలో యూత్ కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టికెట్లు కేటాయించారు. బీఎస్పీ మొత్తం లిస్ట్ లో సుమారు 30 మంది యువతకు టికెట్లు ఇచ్చింది. ఇందులో వరంగల్ ఈస్ట్ నుంచి ట్రాన్స్ జెండర్ మహిళను కూడా బరిలోకి దించింది.