
- నా ప్రాంతానికి సేవ చేస్తే తప్పా: వైఎస్ షర్మిల
- డిండి నిర్వాసితులను ఆదుకుంటామని హామీ
మునుగోడు (మర్రిగూడ ), వెలుగు: ‘‘నేను తెలంగాణలో చదువుకున్నా. ఇక్కడే బతికా. ఇక్కడి అబ్బాయినే పెళ్లి చేసుకున్నా. నా తెలంగాణ ప్రజలకు సేవ చేయాలనుకోవడం తప్పా?’’ అని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ‘‘అధికారులకు చెబితే మన సమస్యలు మారవు. మాయల మరాఠి మాటలతో ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్ గద్దె దిగితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి” అని చెప్పారు. శుక్రవారం ప్రజాప్రస్థానం 17వ రోజు నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో గ్రామస్తులతో ఆమె మాట ముచ్చట జరిపారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ‘‘కరోనా బిల్లులు దగ్గర పెట్టుకోండి. మేం అధికారంలోకి రాగానే చెల్లిస్తాం. ఇంట్లో ఎందరు వృద్ధులున్నా అందరికీ పింఛన్ ఇస్తాం. వైఎస్ సీఎంగా ఉండగా ఎన్నో పథకాలతో సాగును పండుగలా మార్చారు. కేసీఆర్ పాలనలో పీజీలు చేసిన నిరుద్యోగులు కూలీ పనులు చేసుకుంటున్నారు. వైఎస్ సీఎంగా నల్గొండ జిల్లాకు కనీసం 30సార్లు వచ్చారు. ఏడేండ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్ ఎన్నిసార్లు వచ్చారు? గాడిదకు రంగుపూసి ఆవు అని నమ్మించగలరాయన. ఒక్క హామీనీ నెరవేర్చలేదు” అని ఫైరయ్యారు. చర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిండి నిర్వాసితుల్ని ఆదుకుంటామన్నారు.