- పాలపిట్ట రంగులో పార్టీ జెండా, తెలంగాణ మ్యాప్లో వైఎస్ ఫొటో
- పార్టీ ఏర్పాటుపై చెన్నై ఏజెన్సీతో సర్వే
హైదరాబాద్, వెలుగు: షర్మిల ఏర్పాటు చేయనున్న పార్టీ జెండా ఖరారయినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ టీపీ జెండాలో పాలపిట్ట రంగు, నీలం రంగుతో ఉన్న జెండాను షర్మిల ఓకే చేసినట్లు సమాచారం. తెలంగాణ మ్యాప్ మధ్యలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటోతో పార్టీ జెండాను డిజైన్ చేశారు. మరోవైపు పార్టీ ఏర్పాటు కార్యక్రమానికి ఆహ్వానిస్తూ (టీఆర్ఎస్) తెలంగాణ భవన్, (కాంగ్రెస్) గాంధీ భవన్, బీజేపీ స్టేట్ ఆఫీసులకు షర్మిల అనుచరులు వెళ్లి ఇన్విటేషన్ ఇచ్చి వచ్చారు. మిగతా పార్టీలకు మంగళవారం ఆహ్వానం పంపించనున్నట్లు సమాచారం. పార్టీకి సంబంధించి చెన్నైకి చెందిన ఓ ఏజెన్సీతో సర్వే చేయించినట్లు షర్మిల అనుచరులు చెబుతున్నారు. రాష్ట్రంలో 72 నియోజకవర్గాల్లో 3 నెలలు చేసిన సర్వేలో వైఎస్పై పబ్లిక్లో అభిమానం ఉన్నట్లు వెల్లడైందన్నారు. షర్మిల, అభ్యర్థులు వస్తే జనం ఆదరిస్తారా, టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయంగా నియోజకవర్గాల్లో ఉన్న లీడర్లు ఎవరనే అంశాలపై పబ్లిక్ అభిప్రాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పార్టీని 2 రోజుల్లో షర్మిల ప్రకటించనుండటంతో సోమవారం పార్టీ పేరుపై కొన్ని క్లారిఫికేషన్స్ కోసం ఆమె అనుచరులు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. వైఎస్ ఆర్ టీపీ పేరుపై ఎవరూ అభ్యంతరాలు చెప్పకపోవటంతో ఆ పేరునే ఈసీ ప్రకటించే అవకాశముందని ఆమె అనుచరులు చెప్పారు.