మళ్లీ మొదలైంది..పాపికొండల విహారయాత్ర షురూ.. జూన్ నెలలో సాంకేతిక కారణాలతో నది మధ్యలో నిలిచిపోయిన లాంచీ

మళ్లీ మొదలైంది..పాపికొండల విహారయాత్ర షురూ.. జూన్ నెలలో సాంకేతిక కారణాలతో నది మధ్యలో నిలిచిపోయిన లాంచీ
  • విహారయాత్ర నిలిపివేసి ఫిట్​నెస్​ టెస్ట్​ అనంతరం ఏపీ సర్కార్​ గ్రీన్​ సిగ్నల్
  • శనివారం భద్రాచలం నుంచి బయలుదేరిన లాంచీలు

భద్రాచలం, వెలుగు: గత నెలలో తూర్పుగోదావరి జిల్లా గండిపోచమ్మ వద్ద టూరిస్టులతో వస్తున్న లాంచీ సాంకేతిక కారణాలతో గోదావరి నదిలో ఆగిపోయింది. దీంతో టూరిస్టులు బెంబేలెత్తిపోయారు. ఈ కారణంతో పాపికొండల యాత్రకు ఏపీ సర్కార్​ బ్రేక్​ వేసింది. గతంలో ఇదే ప్రాంతంలో కచ్చలూరు వద్ద జరిగిన ప్రమాదంలో 47 మంది టూరిస్టులు జలసమాధి అయిన ఘటనను దృష్టిలో ఉంచుకొని లాంచీలకు ఫిట్​నెస్​ టెస్ట్​లు నిర్వహించారు. 

ధవళేశ్వరంలో ఇరిగేషన్​ ఇంజనీర్లు టెస్ట్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చాక లాంచీలను తిప్పడానికి అనుమతించారు. దీంతో భద్రాచలం, రాజమండ్రి నుంచి టూరిస్టులతో శనివారం లాంచీలు బయలుదేరాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి పుష్కరఘాట్, పోలవరం జిల్లా విలీన వీఆర్​పురం మండలం పోచవరం నుంచి లాంచీలు తిప్పుతున్నారు.

కట్టుదిట్టమైన భద్రతతో..

టూరిస్టుల భద్రతే లక్ష్యంగా ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. లాంచీ ఎక్కే ప్రతి టూరిస్టు ఆధార్​ కార్డు, వివరాలు తీసుకుంటున్నారు. లాంచీ ఎక్కాక వారికి లైఫ్​ జాకెట్లు ఇస్తున్నారు. శిక్షణ​పొందిన సిబ్బంది, అధికారుల పర్యవేక్షణ మధ్య టూర్​ కొనసాగుతోంది. ఫైర్​ నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉంచారు. లైఫ్​ జాకెట్లు, లైఫ్​ బాయ్స్, టైర్లు, తాళ్లు సిద్ధం చేశాకే లాంచీ బయలుదేరుతుందని లాంచీ నిర్వాహకుడు పూనెం వీరభద్రం తెలిపారు.