
పుంగనూరులో దాడులకు నిరసనగా రేపు ( ఆగస్టు5) చిత్తూరు జిల్లా బంద్కు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. పోలీసులపై దాడులకు నిరసనగా బంద్కు పిలుపునిచ్చింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ( ఆగస్టు 4) పుంగనూరులో పర్యటించారు. చంద్రబాబు పర్యటనలో టీడీపీ, అధికార వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్లదాడులు చేసుకున్నాయి. పోలీసులపై, పోలీస్ వాహనాలపై సైతం రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో 20 మంది వరకు పోలీసులు సైతం గాయపడ్డారు. అయితే పుంగనూరులో చంద్రబాబు విధ్వంసం సృష్టించారని, పోలీసులపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా ఖండిస్తూ.. రేపు (ఆగస్టు 5న) చిత్తూరు జిల్లా బందుకు వైసీపీ పిలుపునిచ్చింది. ప్రజలు, పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన తెలియజేసి బందు ను విజయవంతం చేయాలని వైసీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కేఆర్జే భరత్ కోరారు.
పుంగనూరులో జరిగిన రాళ్ల దాడుల ఘటనల్లో ఇరవై మంది పోలీసులు గాయపడ్డారని చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ఇందులో డీఎస్పీ కూడా గాయపడ్డారన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రెచ్చగొట్టడం వల్లే దాడులు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు గ్రామంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన చంద్రబాబునాయుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేను రావణ అని సంబోధించారని తెలిపారు. దీంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిరసన తెలిపేందుకు నిర్ణయించుకున్నారన్నారు.
తంబళ్లపల్లె ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా.. అంగళ్లు గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రోడ్ను బ్లాక్ చేశారని తెలిపారు. నిరసన వ్యక్తం చేయడానికే ఇలా వైసీపీ కార్యకర్తలు రోడ్డును బ్లాక్ చేశారన్నారు. ఇలా చేసినందుకు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై రాళ్ల దాడులు ప్రారంభించారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో అటు వైసీపీ, ఇటు టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయన్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారని.. తెలిపారు. అంగళ్లు గ్రామానికి చంద్రబాబు వచ్చిన తర్వాత.. కార్యకర్తలను మరింతగా రెచ్చగొట్టారని ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తామని ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు.